Begin typing your search above and press return to search.

అదేంటి.. ట్రైలర్ కోసం లోకేష్ దాచారా?

ఇటీవల ఈ సినిమా టైటిల్ ను కూలీగా అనౌన్స్ చేసి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   23 April 2024 5:19 AM GMT
అదేంటి.. ట్రైలర్ కోసం లోకేష్ దాచారా?
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం వెట్టియాన్ తోపాటు లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజినీ.. ఇప్పుడు లోకేష్ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ను కూలీగా అనౌన్స్ చేసి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో కూలీ సినిమా సాగుతుందోనని టీజర్ ద్వారా అర్థమవుతోంది. బంగారంతో డిజైన్‌ చేసిన ఆయుధాలు, వాచ్‌ ఛైన్లతో రజినీ స్టైలిష్ ఫైట్ తో టీజర్ ఇంప్రెసివ్ గా సాగుతోంది. మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులకు కనువిందు చేసేలా కూలీ సినిమా ఉండబోతున్నట్లు టైటిల్ టీజర్ చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. రజినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

అయితే ఈ టైటిల్ టీజర్ ను చూశాక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారట. విక్రమ్, లియో సినిమాల తర్వాత రజినీ టైటిల్ గ్లింప్స్ పై చాలా హోప్స్ పెట్టుకున్నామని, అందుకు తగ్గట్టుగా లేదని చెబుతున్నారు. కూలీ గ్లింప్స్ లో బంగారు గొలుసులను ఆయుధాలుగా ఉపయోగించడం కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. డైలాగులు, రజినీ యాక్షన్ మార్క్ కనిపించలేదని నెటిజన్లు అంటున్నారు.

కమల్ హాసన్ విక్రమ్, దళపతి విజయ్ లియో చిత్రాల గ్లింప్స్ అభిమానులను అప్పట్లో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. విక్రమ్ గ్లింప్స్.. అనిరుధ్ మ్యూజిక్, లోకేష్ కనగరాజ్ మార్క్ తో అదిరిపోయింది. ఇక విజయ్ లియో గ్లింప్స్ లో కరిగే చాక్లెట్ నుంచి ఆయుధాన్ని తీసే సీన్ అయితే వేరే లెవెల్. మరి ఇప్పుడు రజినీ కోసం అలాంటి అద్భుతమైన సీన్స్ ఎందుకు సృష్టించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తం టీజర్ లో కాకుండా.. ట్రైలర్ లో లోకేష్ కనగరాజ్ చూపిస్తారని ఇంకొందరు చెబుతున్నారు.

కాగా, రజినీకాంత్ లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని ఇదివరకే చెప్పారు లోకేష్ కనగరాజ్. తన సినిమాలో తలైవా విలనిజాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు. చెప్పినట్లే.. కూలీ సినిమాలో రజినీని నయా అవతార్ లో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌ పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిస్తోందని సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.