Begin typing your search above and press return to search.

పవన్ పై పోసాని తీవ్ర ఆరోపణలు... దిగజారిపోతున్నాయంటున్న పరిశీలకులు!

ఎన్నికల వేళ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కిపోతున్నాయి. ఈ సమయంలో నేతల మధ్య విమర్శలు పీక్స్ చేరుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   22 April 2024 4:52 PM GMT
పవన్ పై పోసాని తీవ్ర ఆరోపణలు... దిగజారిపోతున్నాయంటున్న పరిశీలకులు!
X

ఎన్నికల వేళ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కిపోతున్నాయి. ఈ సమయంలో నేతల మధ్య విమర్శలు పీక్స్ చేరుకుంటున్నాయి. ఈ సమయంలో తల్లిని, చెల్లినీ తరిమేసిన సైకో అంటూ జగన్ పై విమర్శలు చేస్తుంటే... నలుగురు పెళ్లాల పెద్ద మనిషి అంటూ పవన్ ని, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు, పప్పుని కన్న ముద్దపప్పు అని చంద్రబాబుని విమర్శిస్తున్నారు.

ఇలా నేతల మధ్య రాజకీయ విమర్శలు కాకుండా.. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విమర్శలు తీవ్రమవుతున్నాయి! అవతలి వ్యక్తి క్యారెక్టర్ ని అసానినేషన్ చేయడమే ఇప్పుడు రాజకీయ విమర్శలుగా మారిపోయిన పరిస్థితి. మంచివారంటూ ఎవరూ లేరు.. ఎవరు తక్కువ చెడ్డవారో వారినే ఎన్నుకోవాల్సిన పరిస్థితి అన్నట్లుగా వాతావరణాన్ని మార్చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని పక్కకు పెట్టి.. ప్రత్యర్థులను తీవ్రస్థాయిలో విమర్శించడమే ప్రధాన పనిగా పెట్టుకుంటున్నారు.

ఈ సమయంలో తాజాగా పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇందులో భాగంగా మరోసారి పవన్ కల్యాణ్ భార్యల ప్రస్థావనతో పాటు మరో భార్య కూడా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగత విమర్శలకు ఆజ్యం పోసిన నేతలు.. ఆఖరికి తల్లీ చెల్లి భార్యల వరకూ వ్యవహారాన్ని దిగజార్చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ పై పోసాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. పవన్‌ కళ్యాణ్‌ ఓ మెంటల్‌ కేసంటూ మొదలుపెట్టిన పోసాని... రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రోజురోజుకి దిగజారి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. గతంలో వాలంటీర్లు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయన... రాజకీయాల్లో లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. గతంలోనూ చంద్రబాబు, లోకేష్‌ పై పవన్ విమర్శలు చేశారని గుర్తు చేశారు!

ఇందులో భాగంగా... చంద్రబాబుని పవన్ కల్యాణ్ వెన్నుపోటుదారుడని అనలేదా? నారా లోకేష్‌ ను తిండిబోతు అని పవన్‌ అనలేదా? అని ప్రశ్నించిన ఆయన... లోకేష్ తన అవినీతితో రాష్ట్రాన్ని మింగేశాడని పవన్ విమర్శించారని.. అయితే చంద్రబాబు హెచ్చరించగానే వెళ్లి ఆయన కాళ్లపై పడ్డారంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తన తల్లిని నారా లోకేష్ బూతులు తిడితే పవన్ ఎందుకు మాట్లాడలేదంటూ పోసాని ప్రశ్నించారు!

అదంతా ఒకెత్తు అయితే... పై విమర్శల అనంతరం పోసాని పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ భార్యల టాపిక్ ఎత్తారు. పవన్ కు నలుగురు పెళ్లాలు ఉన్నారని.. ఐదవ పెళ్లాం వెయిటింగ్ లో ఉందని.. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు పోసాని! పైగా ఈ విషయంపై తనకు సినిమా ఇండస్ట్రీ జనాల నుంచి నిఘా సమాచారం అందిందని చెప్పుకొచ్చారు.

దీంతో.. పోసాని వ్యాఖ్యలపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. అంత పర్సనల్ అటాక్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నేతలు... రాజకీయ విమర్శల మాటున వ్యక్తిగత విమర్శలు చేయకూడదని.. ఎవరి హోదాలో వారు అవతలి వ్యక్తి స్థాయిని గౌరవిస్తూ స్పందించాలని సూచిస్తున్నారు. అవతలి వ్యక్తులు కూడా హుందాగా నడుచుకోవాలని చెబుతున్నారు. రాజకీయాలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు!