Begin typing your search above and press return to search.

జగన్ కు షర్మిళ బహిరంగ లేఖ... తెరపైకి తొమ్మిది ప్రశ్నలు!

ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల స్థానంలో నవ సందేహాలు అంటూ వైఎస్ షర్మిళ ఒక బహిరంగ లేఖను జగన్ కు రాశారు.

By:  Tupaki Desk   |   1 May 2024 9:36 AM GMT
జగన్  కు షర్మిళ బహిరంగ లేఖ... తెరపైకి తొమ్మిది ప్రశ్నలు!
X

సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ జగన్ వర్సెస్ కూటమి మధ్య జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు ఒకెత్తు గా సాగుతుంటే... వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ మధ్య రాజకీయం మరొకెత్తులా నడుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేసి నవరత్నాలను మరింత ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల స్థానంలో నవ సందేహాలు అంటూ వైఎస్ షర్మిళ ఒక బహిరంగ లేఖను జగన్ కు రాశారు. ఈ సందర్భంగా తొమ్మిది సందేహాలు తెరపైకి తెచ్చారు. దీంతో... ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ జగన్ ను షర్మిళ మరింతగా వెంటాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా.. ఇటీవల ఓ నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వైఎస్ షర్మిళ చేస్తుంది చాలా తప్పని.. ఆమె పోటీ చేస్తుందనే బాద కంటే ఎక్కువగా ఆమెకు డిపాజిట్లు కూడా రావానే బాద ఎక్కువగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.

దీనిపై స్పందించిన షర్మిళ... "రిమోట్ కంట్రోల్ గురించి జగన్‌ కి బాగా తెలుసు.. గత ఐదు సంవత్సరాలుగా జగన్ కేంద్రంలోని మోడీ చేతుల్లోనూ, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్ లో ఉన్నారు.. ఇద్దరి పేర్లూ "బీ"తోనే స్టార్ట్ అవుతాయి.. అది బీజేపీ అయినా.. ఇంట్లో ఉన్నవాళ్లయినా" అని షర్మిళ సెటైర్లు వేశారు! ఈ క్రమంలో తాజాగా నవసందేహాలు తెరపైకి తెచ్చారు.

ఈ సందర్భంగా షర్మిళ లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి!:

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా?

సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?

28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు?

ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది?

విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు ఎందుకు తీసేశారు?

ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?

ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా?

డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు?

స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?... అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.