Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు... విశాఖ ఎంపీ సీటులో నోట్ల కట్ల పాములు హల్ చల్!

అవును... విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుపున బాలకృష్ణ చిన్నల్లుడు పోటీ చేస్తుండటంతో.. ఇప్పుడు టీడీపీకి ఆ సీటు ప్రతిష్టగా మారిందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2024 4:23 AM GMT
ఓటుకు నోటు... విశాఖ ఎంపీ సీటులో నోట్ల కట్ల పాములు హల్  చల్!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు అన్నది ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఆ ఒక్క కారణంతోనే పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా వదులుకున్న పరిస్థితి అని చెబుతుంటారు. ఈ విషయంపై నాటి నుంచీ తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి! ఈ క్రమంలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ సామాన్య ఓటర్ల విషయంలోనూ అదే ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు.

అవును... విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుపున బాలకృష్ణ చిన్నల్లుడు పోటీ చేస్తుండటంతో.. ఇప్పుడు టీడీపీకి ఆ సీటు ప్రతిష్టగా మారిందని చెబుతున్నారు. మరోపక్క విశాఖను రాజధానిగా ప్రకటించింది వైసీపీ. అలాంటి చోట ఆ పార్టీని ఓడించాలనే పంతంతో టీడీపీ ముందుకెళ్తుందని అంటున్నారు. ఫలితంగా... తమ సొంత సామాజిక వర్గం వారిని ఎంపీగా చేసి అంతర్జాతీయ నగరంలో రాజకీయ పాగా వేయాలని చూస్తున్నారని చెబుతున్నారు.

దీంతో... విజయం కోసం సామదాన భేద దండోపాయాలకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి విశాఖ ఎంపీ సీటులో టఫ్ ఫైట్ నడుస్తోందనే చెప్పాలి! అయితే మెజారిటీ ఓటర్ల మొగ్గు మాత్రం వైసీపీ వైపే ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... వైసీపీని ఓడించి తీరాలన్న కసితో సుమారు పోలింగ్ కి పది రోజుల ముందు నుంచే నోట్లతో ఓట్ల కొనుగోలుకి టీడీపీ తెర తీస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఇందులో భాగంగా... ఎలాగైనా విశాఖ ఎంపీ స్థానంలో పాగా వేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో విశాఖ సిటీ పరిధిలో టీడీపీ బలంగా ఉన్నట్లు కనిపించినా.. ఇపుడు రాజకీయం పూర్తిగా మారిన పరిస్థితి. పైగా వైసీపీ లోకల్ క్యాడిడేట్ అయిన బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్ధిగా పోటీలోకి దించింది. ఈ సమయంలో ఆమెకు రోజు రోజుకీ ఆదరణ, అభిమానం పెరుగుతుండటంతో.. టీడీపీ అభ్యర్ధి శ్రీ భరత్ తేలిపోతున్నారనే అంచనాలు బయటకు వస్తున్నాయి!

దానికి తోడు విశాఖ రాజధాని అని, అక్కడ నుంచే పాలన అని జగన్ స్పష్టం చేయడంతో ఆ ప్రభావం కూడా పడుతోందని అంటున్నారు. దీంతో నోట్ల కట్టలతో రాజకీయం మొదలెట్టేశారు అని అంటున్నారు. ఇందులో భాగంగా... పోలింగుకు సుమారు పది రోజుల ముందు నుంచే నోట్ల కట్ల పాములు బుట్టలో నుంచి బయటకు వస్తున్నాయని అంటున్నారు. దీంతో... టీడీపీకి ఓటమి ముందే తెలిసిపోయిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో... టీడీపీ వాళ్లు ఓటుకి ఎంతిచ్చినా, మరెన్ని కుయుక్తులు పన్నినా.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, విద్యా పథకాలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, నవరత్నాలే తనను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ బల్లగుద్ది మరీ చెబుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో.. జగన్ పాలనతో పాటు గతంలో ఎంపీగా ఉండి తాను చేసిన అభివృద్ధి, ఉత్తరాంధ్ర కోసం పోరాడిన తీరు కూడా తమకు సానుకూలాంశాలని చెబుతున్నారు.

అదేవిధంగా... ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆడబిడ్డలా చూస్తున్నారని, సొంత బిడ్డలా ఆదరిస్తున్నారని.. ఫలితంగా తన గెలుపుని ఆపడం ఎవరి తరం కాదని ఆమె సవాల్ చేస్తున్నారు! ఏది ఏమైనా విశాఖ ఎంపీ సీటులో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్లు నోట్ల కట్టల పంచాయతీ మొదలుపెట్టారని చెబుతున్నారు!