Begin typing your search above and press return to search.

అమెరికా అతి జోక్యం....భారత్ విషయంలో ముసుగు తీసేసిందా...!?

తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అని తెల్ల దేశం మీద ఒక గట్టి భావన.

By:  Tupaki Desk   |   29 March 2024 3:59 AM GMT
అమెరికా అతి జోక్యం....భారత్ విషయంలో ముసుగు తీసేసిందా...!?
X

అమెరికాను ప్రపంచ పోలీస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ పోలీసు కి ఎక్కడ లేని విషయాలూ కావాలి. తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అని తెల్ల దేశం మీద ఒక గట్టి భావన. తాము వందల ఏళ్ళుగా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే అమెరికాకు ప్రజాస్వామ్య లక్షణాల గురించి తెలియదా అన్నది కూడా అంతా ఎపుడూ అనుకునే మాట.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉంది. భారత్ సర్వ సత్తాక స్వతంత్ర దేశం. తన దేశానికి ఏమి కావాలో ఏమి కూడదో భారత్ స్వయంగా నిర్ణయించుకోగలదు. అలాంటి భారత్ మీద అమెరికా పెత్తనం చేయాలని ఉబలాటపడడమేమిటి అన్నది ఒక చర్చ.

భారత్ విషయంలో మొదటి నుంచి అమెరికా పూర్తి స్వచ్ఛంగా ఏమీ వ్యవహరించడం లేదు అని చరిత్ర చెబుతుంది. దాయాది పాక్ ని ఎగదోస్తూ భారత్ ని నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించే నైజం అమెరికా గతంలో చేసేది. ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణల తరువాత భారత్ తో అమెరికా స్నేహం చేస్తోంది కూడా తన స్వార్ధం కోసమే అని అన్న వారూ ఉన్నారు.

భారత్ తన సహజ మిత్రుడు అని అమెరికా నోటి మాటగా అంటున్నా కీలక సమయాలలో మాత్రం తన ముసుగుని తొలగిస్తూనే ఉంది. ఆ మధ్యన కెనడా భారత్ విషయంలో విషం కక్కితే అమెరికా వత్తాసు పలికినట్లుగా కధనాలు వచ్చాయి.

ఇటీవల భారత్ పౌరసత్వ బిల్లుని సవరించి దానిని అమలులోకి తెచ్చింది. దాని మీద కూడా అమెరికా విమర్శలు చేసింది. దానికి భారత్ ధీటైన బదులు ఇచ్చింది అది చాలదు అన్నట్లు ఇప్పుడు ఢిల్లీ సీఎం అరెస్ట్ విషయంలో అమెరికా పనిగట్టుకుని జోక్యం చేసుకుంటోంది. కేజ్రీవాల్ అరెస్ట్ పై అగ్రరాజ్యం అమెరికా ఇటీవల స్పందిస్తూ ఈ వ్యవహారంలో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

ఈ కేసు చూస్తోంది ఈడీ. కేజ్రీవాల్ భారత పౌరుడు. ఆ మీదట ఆయన ఢిల్లీ సీఎం భారత చట్టాల ప్రకారమే ఆయన అరెస్ట్ జరిగింది. విచారణ సాగుతోంది. ఇంతలో అమెరికాకు అంత తొందర ఎందుకు అన్నది ఒక ప్రశ్న అయితే అసలు భారత్ అంతర్గత వ్యవహారాలలో అమెరికా జోక్యం ఏమిటి అన్నది కీలక ప్రశ్న.

భారత్ ఏ చట్టం అమలు చేసినా లేక ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజాస్వామ్యానికి ఏదో అపరాధం జరిగినట్లుగా గగ్గోలు పెట్టడం అమెరికాకే చెల్లింది అని అంటున్నారు. ఇది కచ్చితంగా భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అని కూడా అంటున్నారు.

ఇక అమెరికా తీరు ఇలా ఉంటే భారత్ మాత్రం చెప్పాల్సింది గట్టిగానే చెబుతోంది. ఇప్పటికే ఓసారి అమెరికా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ మరోసారి స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ భారత ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం అని, స్వతంత్ర, దృఢమైన ప్రజాస్వామిక సంస్థల విషయంలో భారత్ గర్విస్తోందని తెలిపారు. సదరు సంస్థలను బాహ్య శక్తుల ప్రభావం నుంచి సంరక్షించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

అంతే కాదు భారతదేశ చట్టపరమైన ప్రక్రియలతో పాటు ఎన్నికల్లో బయటి శక్తుల జోక్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదు అని జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాకు ఈ అంశంపై ఇప్పటికే తీవ్ర నిరసనను వ్యక్తపరిచామని వివరించారు. ఇలా భారత్ అమెరికాకు ధీటైన బదులు ఇచ్చింది. అయినా ఇది సరిపోతుందా లేక ప్రతీ అంశం మీద పెద్దన్న తరహాలో భారత్ కు సలహాలు ఇస్తూ సందేహాలు వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇవ్వాలన్న తన బుద్ధిని అమెరికా చాటుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.