Begin typing your search above and press return to search.

గంటా అయ్యన్నలకు మంత్రి బెర్తులు ఖాయమేనా ?

ఇక రెండవ పదవి టీడీపీ వారికే ఇస్తారు. అయితే ఈసారి కొత్త ముఖాలకే ఇవ్వాలని బాబు చూస్తున్నారుట. పైగా అయ్యన్నకు ఇచ్చి గంటాకు ఇవ్వకపోయినా తంటా.

By:  Tupaki Desk   |   28 April 2024 4:07 AM GMT
గంటా అయ్యన్నలకు మంత్రి బెర్తులు ఖాయమేనా ?
X

టీడీపీ గెలిస్తే చాలు మంత్రులుగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రులుగా రెడీగా ఉంటారు అని అంటారు. ఈ ఇద్దరూ సీనియర్ నేతలే కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. దాంతో పాటు రెండు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే వీరికి విశాఖ జిల్లాలో అగ్ర తాంబూలం దక్కుతోంది.

చంద్రబాబు 2014లో గెలిస్తే గంటా అయ్యన్నలను ఇద్దరినీ మంత్రులుగా చేశారు. అయిదేళ్ల పాటు వారే కొనసాగారు. ఇక 2024లో టీడీపీ మరోసారి గెలిస్తే వీరికి ఎంతవరకూ చాన్స్ ఉంది అన్న చర్చ అపుడే మొదలైంది. ఈసారి టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి. విశాఖ వరకూ చూస్తే బీజేపీతో ఇబ్బంది లేదు కానీ జనసేన నుంచి మంత్రి పదవులకు పోటీ ఖాయమని అంటున్నారు.

విశాఖ సౌత్ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే పెందుర్తి నుంచి పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ ముగ్గురూ కూడా క్యాబినెట్ బెర్తులకు ప్రధాన పోటీదారులు అని అంటున్నారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం తధ్యమని అంటున్నారు.

ఇక రెండవ పదవి టీడీపీ వారికే ఇస్తారు. అయితే ఈసారి కొత్త ముఖాలకే ఇవ్వాలని బాబు చూస్తున్నారుట. పైగా అయ్యన్నకు ఇచ్చి గంటాకు ఇవ్వకపోయినా తంటా. అలాగే ఈయనకు ఇచ్చి ఆయనను పక్కన పెట్టినా మంటే.అందుకే ఈ ఇద్దరూ గెలిచినా సీనియర్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు అని అంటున్నారు. టీడీపీ నుంచి కొత్త వారితో పాటు జనసేనకు ఒక బెర్త్ ఖాయమని అపుడే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. దాంతో ఈ ఇద్దరు సీనియర్లకు మినిస్టర్ పోస్టు నిజంగా అందని పండేనా లేక ఏమైనా అనుకోని పరిణామాలు సంభవిస్తాయా అన్నది చూడాలని అంటున్నారు.