Begin typing your search above and press return to search.

4.5 వేల వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ చేసిందదే.. చేయబోయేది ఇదే!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్‌ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి

By:  Tupaki Desk   |   28 April 2024 6:37 AM GMT
4.5 వేల వైసీపీ సోషల్  మీడియా ఆర్మీ చేసిందదే.. చేయబోయేది ఇదే!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్ కి చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.. పోలింగ్ తేదీ కౌంట్ డౌన్ మొదలైంది.. దీంతో.. ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడాలతో పాటు.. ప్రధానంగా తప్పుడు సమాచారలకు కౌంటర్స్ ఇవ్వడంలో పార్టీలు మునిగిపోయాయి. అయితే.. తప్పుడు సమాచారన్ని ఎదుర్కునే విషయంలో వైసీపీ ముందుందని అంటున్నారు! ఈ సమయంలో... ఆ పార్టీకున్న బలమైన సోషల్ మీడియా సైన్యం సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.

అవును... సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. మే 13న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ సమయంలో ప్రధానంగా.. తప్పుడు సమాచార వ్యాప్తి సమస్యను వైసీపీ బలంగా ఎదుర్కొంటుందని అంటున్నారు. వైసీపీపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రత్యర్థులు పూర్తి అవాస్తవాలను, సత్యదూరాలనూ సమాజంలోకి తెచ్చి, తమకున్న మీడియా బలంతో వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ సమయంలో ఆ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు.. ఏపీ సర్కార్ చేపట్టిని సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో.. సుమారు 4.5వేల మందితో బలంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా సైన్యం పెర్ఫార్మెన్స్ అద్భుతమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను జనంలోని తీసుకెళ్లడంలో ఆ పార్టీ సొషల్ మీడియ వింగ్ అద్భుత పనితీరు కనబరుస్తుంది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్‌ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి... సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లలో ప్రతిపక్షాల దుద్దేశపూరిత ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడుతూ రాష్ట్రంలోని ప్రతి ఓటరుకు కచ్చితమైన సమాచారం చేరేలా చూడటం వింగ్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఇదే సమయంలో... అనేక ప్లాట్‌ ఫారమ్‌ లలోని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ లతో పాటుగా వైసీపీని ఫాలో అవుతున్న సుమారు మిలియన్ ఫాలోవర్ లకు... పార్టీ కార్యక్రమాల గురించి సమాచారాన్ని పంచుకోవడంలో, ప్రస్తుత సంఘటనల గురించి అవగాహనతో కూడిన విశ్లేషణలను అందించడంలో చురుకుగా పాల్గొంటున్నారని భార్గవ్ హైలైట్ చేశారు.

ఇదే సమయంలో... పార్టీ కోసం స్వచ్ఛందంగా పని చేసే వ్యక్తుల భారీ నెట్‌ వర్క్ తమకు ఉందని తెలిపిన భార్గవ్ ... జిల్లా స్థాయిలో సోషల్ మీడియా కమిటీ.. నియోజకవర్గ స్థాయిలో మరొక సోషల్ మీడియా కమిటీలతోపాటు మండల స్థాయి వరకు నెట్ వర్క్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరును చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో తమకున్న బలాన్ని వివరించిన భార్గవ్... మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ ఫారమ్ “ఎక్స్” లో వైసీపీ అధికారిక ఖాతా 8.86 లక్షల మంది అనుచరులను కలిగి ఉందన్ని వెల్లడించారు. ఇదే సమయంలో... యూట్యూబ్ ఛానెల్‌ కు ఐదు లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారని.. ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాకు 1.72 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఫేస్‌ బుక్ పేజీకి 1.2 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారని వెల్లడించారు.

అదేవిధంగా... పార్టీ వాట్సాప్ గ్రూపులు.. స్థానిక గ్రామాల నుండి అంతర్జాతీయ కమ్యూనిటీలకు వ్యాపించి.. లక్షకు పైగా క్రియాశీల సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమయంలో... ప్రతిపక్షాల లోపాలను సమర్ధవంతంగా ఎత్తిచూపుతూ.. సీఎం జగన్ సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చూడడమే వారి ప్రాథమిక లక్ష్యమని వివరించారు.

ఇదే క్రమంలో... మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తమ సొంత పార్టీ విధానాలను వివరించడం కంటే ఎక్కువగా... తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, సీఎం జగన్‌ ను దూషించడంపైనే ప్రతిపక్షాలు ఎక్కువ దృష్టి సారించాయని ఈ సందర్భంగా భార్గవ్ ఆరోపించారు.

కాగా... ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన జగన్... సమాచారాన్ని ప్రచారం చేసేటప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వెలువడుతున్న సర్వేల ఫలితాల్లో మాగ్జిమం ఫలితాలు.. వైసీపీకి అనుకూలంగా వస్తున్న సంగతి తెలిసిందే!