Begin typing your search above and press return to search.

కురుక్షేత్రానికి ముందే పాండవులు మరణించారట

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:43 PM GMT
కురుక్షేత్రానికి ముందే పాండవులు మరణించారట
X
మహాభారతం గురించి తెలియనివారు ఉండరు.. కురుక్షేత్ర యుద్ధం.. అందులో పాండవులు కౌరవులపై విజయం సాధించడం తెలిసిందే. అయితే... మహాభారత యుద్ధానికి ముందే పంచ పాండవుల్లోని నలుగురు మరణించారన్న సంగతి ఎంతమందికి తెలుసు.. అలా మరణించిన తన తమ్ముళ్లను ధర్మరాజు ఎలా బతికించుకున్నాడన్నదీ ఆసక్తికరమే. దీని వెనుక పెద్ద కథే ఉంది. అరణ్యపర్వంలో ఈ ఘట్టం మొత్తం ఉంటుంది.

ధర్మరాజు తన నలుగురు సోదరులతో కలిసి ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చిన తన ఉత్తరీయం లేడి కొమ్ములలో ఇరుక్కుపోయిందని.. దాన్ని తెచ్చివ్వాలని కోరుతాడు. దాంతో అయిదుగురూ ఆ లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతారు. కానీ, దాన్ని పట్టుకోలేక అలసిపోతారు. దాంతో అలసట తీర్చుకునేందుకు నీటిని తెమ్మంటూ నకులుడిని పంపిస్తాడు ధర్మరాజు. నకులుడు సమీపంలోని ఒక చెరువు వద్దకు వెళ్లి నీటిని పట్టుకోబోగా ఒక స్వరం వినిపిస్తుంది. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాకే నీటిని పట్టుకోవాలని.. లేదంటే మరణం తథ్యమని హెచ్చరిస్తుంది.

కానీ.. నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీటిని తీసుకుంటాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణిస్తాడు. నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మారాజు సహదేవుడిని పంపిస్తాడు. ఆయనా తిరిగి రాడు.. ఇలా ఒక్కొక్కరిని పంపించగా ఎవరూ వెనక్కి రారు. చివరగా ధర్మారాజే నీటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ చెరువు వద్దకు వెళ్తాడు. అక్కడ తమ్ముళ్ల మృతదేహాలు చూసి ఏదో జరిగిందని గుర్తిస్తాడు. ఇంతలో అశరీరవాణి పలుకులు వినిపిస్తాయి. జరిగిన కథంతా చెప్పి తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే వారికి పట్టిన గతే పడుతుందని చెబుతుంది. దాంతో ధర్మరాజు ఆ ప్రశ్నలు అడగమంటాడు. మొత్తం ప్రశ్నలు అడగ్గా అన్నిటికీ సమాధానాలు చెబుతాడు ధర్మరాజు. దాంతో సంతృప్తి చెంది ఒక యక్షుడు ప్రత్యక్షమై ధర్మరాజు నలుగురి తమ్ముళ్లకూ మళ్లీ ప్రాణం పోస్తాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలు కావడంతో వాటిని యక్ష ప్రశ్నలు అంటారు. అయితే.. యమధర్మరాజే ధర్మరాజును పరీక్షించేందుకు ఇలా యక్షుడి రూపంలో ప్రశ్నలు అడిగినట్లు భారతంలో ఉంటుంది.

ఇవీ కొన్ని యక్ష ప్రశ్నలు..(సమాధానాలు)

* మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

* మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

* జీవన్మృతుడెవరు? (దేవతలకూ - అతిధులకూ పితృ సేవకాదులకు పెట్టకుండా తినువాడు)

* భూమికంటె భారమైనది ఏది? (జనని)

* గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

* భూమిపైన ఉన్న గడ్డిపరకల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ఉండేదేంటి.. (ఆలోచనలు)

* నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

* రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

* మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

* దేవలోకానికి దారి ఏది? (సత్యం)

* లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

* సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

* ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస.. దీన్నే అహింసో పరమో ధర్మ: అంటారు)

* దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

* లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియం - అప్రియం - సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/