సూపర్‌ హిట్ మూవీ పార్ట్‌ 3 పనులు షురూ!

ప్రస్తుతం దర్శకుడు అమర్ కౌశిక్‌ స్త్రీ 3 కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలోనే సినిమా షూటింగ్‌ మొదలు పెట్టే విధంగా కథను రెడీ చేస్తున్నాడు.

Update: 2024-10-19 21:30 GMT

రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'స్త్రీ' సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన స్త్రీ సినిమాకు దాదాపు రూ.180 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. అమర్‌ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన స్త్రీ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్‌ కి ఆలోచన మొదలైంది. దర్శకుడు అమర్ కౌశిక్ అదే తారాగణంతో 'స్త్రీ 2' సినిమాను రూపొందించి ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అమర్ కౌశిక్‌ మరోసారి స్త్రీ తో హిట్‌ అందుకున్నాడు. అయితే ఈసారి అందుకున్న హిట్‌ మామూలు హిట్‌ కాదు. ఇండస్ట్రీ హిట్‌గా స్త్రీ 2 నిలిచిన విషయం తెల్సిందే.

'స్త్రీ 2' సినిమాను దర్శకుడు అమర్ కౌశిక్‌ రూ.100 కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందించడం జరిగింది. మొదటి పార్ట్‌ కి రూ.180 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. కనుక స్త్రీ 2 సైతం రూ.150 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. మేకర్స్‌ రూ.100 కోట్ల వసూళ్లు నమోదు అయితే గొప్ప విషయం అన్నట్లుగా భావించారు. కానీ స్త్రీ 2 సినిమా మొన్నటి వరకు థియేటర్‌ లో కొనసాగింది. రెండు నెలలు కంటిన్యూగా ఉత్తర భారతంలో స్త్రీ 2 సందడి కొనసాగింది. దాంతో వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద స్త్రీ 2 సినిమా ఏకంగా రూ.875 కోట్ల వసూళ్లు నమోదు అయింది.

సౌత్‌ లో ఎక్కువగా ప్రమోషన్ చేయకుండా, డబ్‌ చేసి విడుదల చేయకుండానే ఆ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. సౌత్‌లోనూ మొదట డబ్ చేసి థియేటర్‌ ల ద్వారా విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఇప్పుడు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సొంతం చేసుకుని ఉండేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్త్రీ 2 గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా ఊహించినట్లుగానే డిజిటల్‌ ప్రపంచంలో స్త్రీ 2 కి అద్భుతమైన స్పందన దక్కింది.

ప్రస్తుతం దర్శకుడు అమర్ కౌశిక్‌ స్త్రీ 3 కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలోనే సినిమా షూటింగ్‌ మొదలు పెట్టే విధంగా కథను రెడీ చేస్తున్నాడు. స్త్రీ 2 కథకు కొనసాగింపుగా 3వ పార్ట్‌ ఉంటుందని తెలుస్తోంది. మళ్లీ ముఖ్య పాత్రల్లో శ్రద్దా కపూర్‌, రాజ్ కుమార్ రావు, పంకజ్‌ తివారీ లు నటించబోతున్నారు. మొదటి రెండు పార్ట్‌ లు మంచి విజయాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే పార్ట్‌ 3 పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ స్థాయి అంచనాలు అందుకోవడం దర్శకుడు అమర్ కౌశిక్ కు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడవ పార్ట్‌ ను సైతం 100 నుంచి 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలో అధికారికంగా సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News