అనిల్ రావిపూడి.. మెగా సినిమాకు సాలీడ్ రెమ్యునరేషన్?
టాలీవుడ్లో వరుస విజయాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా తన సత్తా చాటుకుంటున్న అనిల్ రావిపూడి, మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేశారు.
టాలీవుడ్లో వరుస విజయాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా తన సత్తా చాటుకుంటున్న అనిల్ రావిపూడి, మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఘన విజయం సాధించి, నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా ఆయన మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ను పూర్తిగా మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈసారి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే చిరంజీవి ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, షూటింగ్ 2024 రెండో అర్ధభాగంలో మొదలవుతుందని సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరపాటి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎప్పటిలానే అనిల్ రావిపూడి తన సినిమా కోసం ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
చిరంజీవి గత కొంతకాలంగా మాస్ మసాలా కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో, అనిల్ రావిపూడి పూర్తి స్థాయి వినోదభరితమైన ఎంటర్టైనర్గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా అప్డేట్ తో పాటు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం విజయంతో మరో లెవెల్ కు వచ్చిన అనిల్ రావిపూడి, తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేశారని తెలుస్తోంది.
మెగాస్టార్ ప్రాజెక్టుకు ఆయన ఏకంగా 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. సాధారణంగా, టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ డైరెక్టర్స్కు డిమాండ్ ఎక్కువే ఉంటుంది. అయితే ఒకే దశలో ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే నిర్మాత సాహు గరపాటి కూడా సంక్రాంతికి వస్తున్నాం విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, అనిల్ రావిపూడికి ఈ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇటీవల వరుస విజయాలతో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్లో ప్రముఖ బ్యానర్గా ఎదుగుతోంది. చిరంజీవితో సినిమా అంటే అటు నిర్మాతలకు, ఇటు దర్శకుడికి కూడా ఓ బిగ్ డీల్ అవుతుంది. అందుకే అనిల్ రావిపూడి డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఓకే చేయడంతో పాటు, సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించడానికి సాహు గరపాటి రెడీ అయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సంగీతానికి భీమ్స్ సిసిరోలియోను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారని సమాచారం. అంతేకాకుండా, అనిల్ రావిపూడి తన స్నేహితులైన ఇతర టెక్నీషియన్లను కూడా ఈ ప్రాజెక్ట్లో కొనసాగించనున్నారని టాక్. ఇక సినిమాను 2026 సంక్రాంతికి గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి గతంలో ఈ సీజన్లో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అనిల్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ తో స్ట్రాంగ్ హిట్స్ ఇచ్చాడు. కాబట్టి ఈసారి అనిల్ రావిపూడి మెగా కాంబినేషన్ టాలీవుడ్ బాక్సాఫీస్ను ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.