దేవర ముందు డిజాస్టర్!

రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది.

Update: 2024-08-03 13:27 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నాళ్ళ నుంచో మన నిర్మాతలు అమ్మడిని తెలుగులో పరిచయం చేయాలని ప్రయత్నాలు చేయగా.. చివరకు 'దేవర' సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా కనిపించబోతోంది. అయితే ఈ మూవీ కంటే ముందు హిందీలో హిట్టు కొట్టి, అదే జోష్ లో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకున్న బాలీవుడ్ బ్యూటీకి ఇప్పుడు నిరాశే ఎదురైంది.

జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ''ఉలాజ్‌''. నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్ సుధాంషు సరియా దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా.. నిన్న (ఆగస్టు 2) శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజే ఈ హిందీ చిత్రానికి ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది.

నిజానికి 'ఉలఝ్‌' సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసింది జాన్వీ కపూర్. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథలో థ్రిల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ మిక్స్ చేసే ప్రయత్నాలు చేసినా.. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదని రివ్యూలు చెబుతున్నాయి. ట్విస్టులు కూడా ముందే ఊహించేలా ఉండటం ప్రధాన లోపంగా చెబుతున్నారు. అయితే లండన్ లోని రాయబారి కార్యాలయంలో పని చేసే అత్యంత పిన్న వయస్కురాలైన డిప్యూటీ హైకమిషనర్‌గా, యువ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుహానా భాటియా పాత్రలో జాన్వీ ఆకట్టుకుంటుంది. కానీ దీనికి తగ్గ ఫలితం దక్కపోవడమే డిజప్పాయింట్ చేస్తోంది.

'దఢక్' సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. ఇప్పటి వరకూ సరైన కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటుందనే పేరు తెచ్చుకుంటోంది కానీ, అవేమీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెరఫార్మ్ చేయలేదు. నటిగా తనని తాను మెరుగు పరుచుకుంటున్నప్పటికీ, ఆశించిన రిజల్ట్స్ మాత్రం అందుకోలేకపోతోంది. లేటెస్టుగా 'ఉలఝ్‌' రూపంలో మరో ప్లాప్ పలకరించింది. దీంతో ఇప్పుడు ఆమె సౌత్ సినిమాలపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర 1' సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ విడుదలవ్వక ముందే జాన్వీ కపూర్ మరో రెండు క్రేజీ ఆఫర్స్ కొట్టేసింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందనున్న RC 16 చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే క్రమంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సరసన నటించడానికి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇవి హిట్టయితే మాత్రం జాన్వీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లోకి చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News