అలాగంటే సినిమానే చేయ‌నంటున్న‌ శ‌ర్వానంద్‌!

Update: 2022-09-16 01:30 GMT
శర్వానంద్..  టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో ఈయన ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శర్వానంద్.. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే గత కొంత కాలం నుంచి శర్వానంద్ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతోంది.

2017లో విడుదలైన 'శతమానంభవతి' సినిమా తర్వాత శర్వానంద్ హిట్ ముఖమే చూడలేకపోయాడు. ఇలాంటి తరుణంలో 'ఒకే ఒక జీవితం' మూవీతో శర్వానంద్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రీతూ వర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది.

అలాగే అమల అక్కినేని ఈ సినిమాలో శ‌ర్వాకు తల్లి పాత్రను పోషించింది. సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ కి అమ్మ ప్రేమను ముడిపెట్టి కథా, కథనాలను అల్లడంలో దర్శకుడు శ్రీ కార్తీక్ సూపర్ గా సక్సెస్ అయ్యాడు. అక్కడ అక్కడ ప‌లు స‌న్నివేశాల‌ను సాగదీసినట్లు అనిపించినా.. కథాకథనం, అమల-శర్వానంద్ ల పర్ఫామెన్స్,  మనసుల్ని హత్తుకునే భావోద్వేగం సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

దీంతో ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక చాలా కాలం తర్వాత హిట్టు కొట్టి ఫుల్ జోష్ లో ఉన్న శర్వానంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను సైతం పంచుకున్నాడు.

ముఖ్యంగా త‌న శ‌రీర బ‌రువుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వాస్త‌వానికి ఇంత‌కుముందు లావుగా ఉన్న శ‌ర్వానంద్.. దాదాపు ఆరు నెల‌ల‌కు పైగా బ్రేక్ తీసుకుని ఎంతో క‌ష్ట‌ప‌డి స్లిమ్ గా, ఫిట్ గా త‌యార‌య్యాడు. అయితే ఈ విరామం బ‌రువు త‌గ్గ‌డం కోస‌మే కాద‌ని.. తాను ఎంచుకోవాల్సిన స్క్రిప్ట్‌ల గురించి మళ్లీ విశ్లేషించడానికి కూడా అవసరమని తాను భావించిన‌ట్లు శ‌ర్వానంద్ చెప్పుకొచ్చారు.

అలాగే బ‌రువు త‌గ్గ‌డ‌మ‌నేది అంత సుల‌భ‌మైన ప‌నేమి కాదంటున్నాడు శ‌ర్వా. ఒక వేళ క్యారెక్ట‌ర్ కోసం బరువు పెరగాలంటే తాను అస‌లు సినిమానే చేయన‌ని, అన్నింటికంటే ఆరోగ్యమే త‌న‌కు ముఖ్యమ‌ని పేర్కొన్నాడు. తాను ఫిట్‌గా మారేందుకు తొమ్మిది నెల‌లు ప‌ట్టింద‌ని, బ‌రువు పెర‌గ‌డం సుల‌భ‌వం.. కానీ బ‌రువు త‌గ్గి శరీరాన్ని చ‌క్క‌దిద్దుకోవడం క‌ష్ట‌మైన ప‌ని.. తాను మళ్ళీ ఆ మానసిక గాయం గుండా వెళ్ళలేనంటూ శ‌ర్వానంద్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. ఇందులో రాశి ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం.. మ‌రికొద్ది రోజుల్లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. ఇక స్క్రిప్ట్ దశలో ఉన్న మరో మూడు సినిమాలకు సైతం శ‌ర్వా సైన్ చేశాడ‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News