ప్రియమైన అభిమాన మిత్రులకు.. మహేష్ బహిరంగ లేఖ..!

Update: 2022-05-07 11:33 GMT
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసారు. 'ప్రియమైన అభిమాన మిత్రులకు' అని సంబోధించిన అగ్ర హీరో.. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసి స్పందన తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా తన తదుపరి మూవీ SSMB28 అప్డేట్ కూడా ఇచ్చారు.

''ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - జి.యమ్. బి. ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ - యలమంచిలి రవి శంకర్ - ఆచంట రామ్ - ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై.. రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది''

''ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన 'సర్కారు వారి పాట' చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చిన్న బాబు) నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కాగలదు. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి'' అని మహేష్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తమ అభిమాన హీరో తమని ఉద్దేశిస్తూ ఇలా ఓపెన్ లెటర్ విడుదల చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా, 'సర్కారు వారి పాట' సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇందులో మహేష్ మాస్ అవతార్ లో సరికొత్త లుక్ లో కనిపించారు. పొడవాటి జుట్టు - మెడ పై రూపాయి టాటూ కాయిన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ స్వాగ్ మరియు మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కు కనువిందు చేయబోతున్నాయి.

SVP సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - నదియా - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణమురళి - మహేష్ మంజ్రేకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆర్ మదే సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శనివారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగబోతోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు మహేష్ అండ్ టీమ్ తో పాటుగా పలువురు ముఖ్య అతిధుల హాజరు కాబోతున్నారు. ఇకపోతే SVP తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లతో వర్క్ చేయనున్నాడు
Tags:    

Similar News