ఇది ప్రభాస్ కు అతి పెద్ద వైఫల్యమేనా..?

Update: 2022-03-19 05:30 GMT
'బాహుబలి' 'సాహో' వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇటీవల ''రాధేశ్యామ్'' అనే పీరియాడికల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి మూడు రోజులు మంచి వసూళ్ళు అందుకోగా.. తొలి వారం ముగిసే సరికి డిజాస్టర్ గా మిగిలిపోయింది.

'రాధేశ్యామ్' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు కలిసి దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీనికి తగ్గట్టుగా ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. అన్ని ఏరియాలలో హయ్యర్స్ తో కలిపి భారీ రేట్లకు అమ్మారు. అయితే తొలి మూడు రోజుల్లో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగో రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

విధికి ప్రేమకి మధ్య యుద్ధంగా అభివర్ణించిన 'రాధేశ్యామ్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజువల్ గ్రాండియర్ గా ఉన్నప్పటికీ వీక్ డేస్ లో జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. దీంతో వారం రోజుల రన్ పూర్తయ్యే నాటికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

నాన్ థియేట్రికల్ రైట్స్ తో 'రాధేశ్యామ్' నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. కానీ ఎక్కువ మొత్తంలో చెల్లించి సినిమా తీసుకున్న బయ్యర్లకు మాత్రం నష్టాలు తప్పేలా లేవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సుమారు వంద కోట్లకు తీసుకున్నారు. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 55 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకురావడం అసాధ్యమే.

ఇక ఉత్తరాదిలో ప్రభాస్ కు భారీ క్రేజ్ ఉంది. 'సాహో' సినిమా తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. హిందీలో మంచి వసూళ్ళు సాధించింది. ఇప్పుడొచ్చిన 'రాధేశ్యామ్' సినిమా మాత్రం నార్త్ బెల్ట్ లో దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. వారం రోజుల్లో సుమారు 20 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. తమిళ్ మలయాళం కన్నడలలోనూ ప్రభాస్ సినిమా ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

ఓవర్సీస్ లో పర్వాలేదనుకున్నప్పటికీ.. రెండో వారంలో అక్కడ కూడా బాగా డల్ అయింది. వచ్చే వారం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అప్పటి వరకు 'రాధేశ్యామ్' వసూళ్లకు డోకా ఉండకపోవచ్చని మొదట్లో అందరూ భావించారు. కానీ ఇప్పుడు థియేటర్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోవడం చూస్తుంటే.. ఆదివారం కలెక్షన్స్ తో ఫైనల్ రన్ ముగుస్తుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు మొన్న శుక్రవారం పలు చిన్న సినిమాలతో పాటుగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చారు. అలానే 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి స్క్రీన్స్ పెంచారు. దీంతో 'రాధేశ్యామ్' సినిమా కొన్ని థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. రెండో వారంలో ఈ సినిమా భారీ వసూళ్లు అందుకునే అవకాశమైతే లేదు. ప్లాప్ అయినా ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ సినిమా డార్లింగ్ కెరీర్ లో అతిపెద్ద పరాజయమని చెప్పొచ్చు.

'రాధేశ్యామ్' చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిచారు. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. జస్టిన్ ప్రభాకర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
Tags:    

Similar News