అందుకే స్టేజ్ పై డ్యాన్స్ చేశా: మహేశ్ బాబు

Update: 2022-05-21 16:33 GMT
సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్లకు కూడా దూరంగా ఉండే మహేశ్.. తర్వాత కాలంలో సినిమా వేడుకలలో పాల్గొంటూ అభిమానుల్లో జోష్ నింపే స్పీచ్ ఇస్తూ వచ్చారు.

ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా స్టేజ్‌ పై మహేష్ బాబు తన సినిమాలోని డైలాగ్స్ చెప్పడం గానీ.. డాన్స్ చేసిన దాఖలు కానీ లేవు. అయితే ఇటీవల 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా కర్నూలులో నిర్వహించిన ఈవెంట్ లో మొదటిసారి వేదికపై డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మహేష్.

'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన చిత్రం "సర్కారు వారి పాట". పరశురామ్‌ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా 'సర్కారు వారి పాట' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ విజయం పట్ల మహేష్ బాబు ఏంతో సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్‌ మరియు డైరెక్టర్‌ పరశురామ్‌ తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌ చాట్ నిర్వహించారు మహేష్.

ఈ సందర్భంగా సర్కారు వారి పాట సినిమా గురించి వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు మహేశ్ బాబు. ఇందులో భాగంగా కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. తనకు తెలియకుండానే అలా జరిగిపోయిందని చెప్పారు.

'స్టేజ్‌ పైకి ఎక్కి డ్యాన్స్‌ చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు?' అని అడిగిన ప్రశ్నకు మహేశ్‌ బాబు సమాధానం చెబుతూ.. "అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్‌ మొత్తం షాక్‌ లో ఉండిపోయారు. రెండేళ్లు కష్టపడి మూవీ చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక స్టేజ్‌ పైకెక్కి డ్యాన్స్‌ చేయాలనిపించింది. అలా చేసేశా" అని అన్నారు.

ఇకపోతే SVP తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన తదుపరి సినిమా చేయనున్నారు. మే 31న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానుంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు.
Tags:    

Similar News