బాలకృష్ణ రీమేక్ చేసిన ఎన్టీఆర్ సినిమాలివే!

Update: 2022-04-28 01:30 GMT
తెలుగు తెరపైన .. తెలుగు ప్రేక్షకుల హృదయాలపైన ఎన్టీఆర్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. సాంఘిక .. జానపద .. పౌరాణిక ..  చారిత్రక చిత్రాల ద్వారా ఎన్టీఆర్ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. వెండితెరపై రాముడైనా-కృష్ణుడైనా-రాయలవారైనా-విశ్వమిత్రుడైనా-శ్రీనాథ కవిసార్వభౌముడైనా ఎన్టీ రామారావే. అంతటి తేజస్సు ఉన్న కథానాయకుడు ఏ భాషలోను కనిపించడు. ఎన్టీ రామారావు తరువాత జానపద .. పౌరాణిక పాత్రలు చేయాలంటే ఆయన వారసుడైన  బాలకృష్ణ వల్లనే అవుతుందనే టాక్ వచ్చింది.

బాలకృష్ణ  తన తండ్రి మాదిరిగా అన్నిరకాల పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ముఖ్యంగా జానపద .. పౌరాణిక పాత్రలలో తన తండ్రిని గుర్తుకు చేశారు. తన తండ్రి  చేసిన కొన్ని సినిమాల రీమేకులలో తాను చేశారు. అలాంటి సినిమాల జాబితాలో 'నర్తనశాల' ఒకటిగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ చేసిన పౌరాణికాలలో 'నర్తనశాల' ఒకటి.

'విరాటపర్వం' చుట్టూ తిరిగే కథ ఇది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను రీమేక్ చేయాలని బాలకృష్ణ భావించారు. ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య చనిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఇక ఎన్టీ రామారావు 'రాముడు భీముడు' టైటిల్ తో ద్విపాత్రాభినయం చేయగా, అదే టైటిల్ తో బాలకృష్ణ కూడా ద్విపాత్రాభినయం చేశారు. రామారావు చేసిన 'వద్దంటే డబ్బు' సినిమాకి బాలకృష్ణ చేసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమాకి  చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలకృష్ణకి మంచి హిట్ ను ఇచ్చింది. రామారావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'పాండురంగ మహాత్మ్యం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా రీమేకులో బాలకృష్ణ చేయగా ఫలితం నిరాశపరిచింది.


'లవకుశ' సినిమాను 'శ్రీరామరాజ్యం' పేరుతో బాలకృష్ణ  హీరోగా రీమేక్ చేయబడింది. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంది. రామారావు కెరియర్లో జానపదాలలో తలమానికంగా కనిపించే పాతాళభైరవి .. గులేబకావలి కథ .. జగదేకవీరుడు .. రాజపుత్ర రహస్యం సినిమాలలోని కథలను టచ్ చేస్తూ 'భైరవద్వీపం' రూపొందింది. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఇలా బాలకృష్ణ  జానపద .. పౌరాణికాలలో తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవడం విశేషం.
Tags:    

Similar News