గురూజీ మ‌ళ్లీ ప్లాన్ మొత్తం మార్చుకోవాల్సిదేనా?

Update: 2022-11-16 07:11 GMT
కొన్ని సార్లు స‌మ‌యం అనుకూలిస్తే వ్య‌క్త‌లు అనుకులంగా వుండ‌రు.. మ‌రొక‌సారి వ్య‌క్తులు అనుకూలంగా వుంటే స‌మ‌యం అనుకూలించ‌దు. అవ‌న్నీ అనుకూలించినా విధి అడ్డంకులు సృష్టిస్తూ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తూ వుంటుంది. ఇప్ప‌డు ఇదే ప‌రిస్థితిని స్టార్ డైరెక్ట‌ర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఎదుర్కొంటున్నారు. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ మూవీని చేస్తున్న విష‌యం  తెలిసిందే.

SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా అదుగో ఇదుగో అంటూ అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన ఈ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 12న అన్న‌పూర్ణ స్టూడియోస్ లో మొద‌లైంది. అన్బు అరివు ఫైట్ మాస్ట‌ర్ల నేతృత్వంలో హై వోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు.

త్రివిక్రమ్ - మ‌హేష్ ల క‌ల‌యిక‌లో దాదాపు 12 ఏళ్ల త‌రువాత సెట్స్ పైకి వెళ్లిన సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా ఓ రేంజ్ లో వుంటుంద‌ని అప్పుడే ఫ్యాన్స్ లెక్క‌లు వేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈలోగా రామోజీ ఫిల్మ్ సిటీకి మారిన షూటింగ్ ఎట్ట‌కేల‌కు అక్క‌డ వేసిన ప్ర‌త్యేక సెట్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఆ త‌రువాత నుంచే ఈ ప్రాజెక్ట్ కి అడుగ‌డుగునా అడ్డంకులు మొద‌ల‌య్యాయి.

ఫ‌స్ట్ షెడ్యూల్ బ్రేక్ త‌రువాత పూర్తి స్థాయి క‌థ వినిపించాల‌ని త్రివిక్రమ్ ఏర్పాట్లు చేసుకుంటున్న త‌రుణంలో మ‌హేష్ మ‌ద‌ర్ ఇందిరా దేవి మృతి చెంద‌డంతో సినిమా త‌దుప‌రి షెడ్యూల్ మ‌రింత వెన‌క్కి వెళ్లింది. హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావ‌డంతో ఇక త‌దుప‌రి షెడ్యూల్‌ డిసెంబ‌ర్ లోనే అని ఫ‌క్స‌య్యారు. క‌ట్ చేస్తే త్రివిక్ర‌మ్ క‌థ‌లో మార్పులు చేయ‌డం, ముందు తీసిన యాక్ష‌న్ ఎపిసోడ్ ని ప‌క్క‌న పెట్టేయ‌డం.. ఇదే స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి చెంద‌డంతో త్రివిక్ర‌మ్ ప్లాన్ మొత్తం మారిపోయింది.

తండ్రిని కోల్పోయిన బాధ‌లో వున్న మ‌హేష్ ఇప్ప‌ట్లో సెట్ లోకి రావ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. ఒకే ఏడాది అన్న ర‌మేష్ బాబు, త‌ల్లి ఇందిరా దేవి, తాజాగా తండ్రి కృష్ణ‌ని కోల్పోవ‌డంతో తీర‌ని దుఃఖంలో వున్నారు మ‌హేష్. ఈ విషాదం నుంచి త‌ను కోలుకోవాలంటే క‌నీసం నెల‌రోజులు ప‌డుతుంది.

ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర‌న్ లో మొద‌లు పెట్టాల‌నుకున్న మ‌హేష్ తాజా మూవీ షూటింగ్ ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. జ‌న‌వ‌రి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. అంటే త్రివిక్ర‌మ్ త‌న ప్లాన్ ని పూర్తిగా మార్చుకోక త‌ప్ప‌ద‌న్న‌మాట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ తాజాగా మారిన రిణామాల నేప‌థ్యంలో రిలీజ్ స‌మ‌యం కూడా మారే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News