స్త్రీత్వాన్ని అవ‌మానించారు.. ముగ్గురు న‌టుల‌పై న‌టి ఫిర్యాదు

యూట్యూబ్ ఛానెల్ ద్వారా తారలు త‌న‌ను అవమానించారని అలువాకు చెందిన నటి నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Update: 2024-10-12 23:30 GMT

యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్త్రీత్వాన్ని కించపరిచారంటూ ఓ యువ నటి చేసిన ఫిర్యాదు మేరకు సినీ, సీరియల్ స్టార్ బీనా ఆంటోనీ, ఆమె భాగస్వామి మనోజ్, నటి స్వసికపై కేసు నమోదైంది. అలువాకు చెందిన నటి ఫిర్యాదు మేరకు నెడుంబస్సేరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బీనా ఆంటోని మొదటి ముద్దాయిగా, భాగస్వామి మనోజ్ రెండో ముద్దాయిగా, స్వసిక మూడో ముద్దాయిగా ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తారలు త‌న‌ను అవమానించారని అలువాకు చెందిన నటి నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

హేమ కమిటీ నివేదిక తర్వాత స‌ద‌రు నటి పలువురు మలయాళ సినీ తారలపై లైంగిక వేధింపుల ఆరోపణలను లేవనెత్తింది. తనను చెడ్డ అమ్మాయిగా చిత్రీకరించేందుకు బీనా ఆంటోనీ, తన భర్త మ‌నోజ్, స్వసిక ప్రయత్నించారని నటి ఫిర్యాదులో పేర్కొంది. ముగ్గురు వ్యక్తుల వ్యాఖ్యలు స్త్రీత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని స‌ద‌రు నటి పేర్కొంది. అయితే ఈ కేసుపై బీనా ఆంటోని ప్ర‌తిస్పందించారు. తానెప్పుడూ తప్పుదారి పట్టలేదని, అవకాశాల కోసం ఎవరి వెంట వెళ్లలేదని, ఈరోజుల్లో ఆడవాళ్లలాగా తనకు అవకాశాలు రావడం లేదని బీనా ఆంటోనీ అన్నారు.

తనపై ఆరోపణలు చేసిన నటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీనా ఆంటోనీ తెలిపారు. గతంలో మనోజ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స‌ద‌రు నటిపై విరుచుకుపడ్డాడు. దీని తరువాత నటుడు మనోజ్, బీనా ఆంటోనీకి వ్యతిరేకంగా స‌ద‌రు న‌టి కూడా ప‌లు వ్యాఖ్య‌ల‌తో ముందుకు వచ్చింది. `భార్య ఏం చేసినా వేరే ఆడవాళ్ళకి చెప్పేవాడు` అని మనోజ్ సీక్రెట్స్ ని ఆ న‌టి బ‌య‌టికి చెప్పింది. మనోజ్ భార్య గురించి తనకు చాలా కథలు తెలుసునని, అవసరమైతే వీడియోను షేర్ చేస్తానని చెప్పింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో పోలీసులు త‌ల‌మునక‌లుగా ఉన్నారు.

Tags:    

Similar News