పోటీ హీరో కోసమా లేక డైరెక్టర్ కోసమా?
ఈ ఏడాది రిలీజ్ కానున్న కూలీ సినిమా తెలుగు హక్కుల కోసం తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది.;
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. ఉపేంద్ర, నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం రజినీ ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాక్షన్, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఈ ఏడాది రిలీజ్ కానున్న కూలీ సినిమా తెలుగు హక్కుల కోసం తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కూలీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులకు తీవ్ర పోటీ నెలకొంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా హక్కుల కోసం టాలీవుడ్ లోని పలు పెద్ద సంస్థలు పోటీ పడుతున్నట్టు సమాచారం.
వారిలో ముఖ్యంగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో పాటూ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం కూలీ రైట్స్ కోసం రూ.40 కోట్లు రేటు చెప్పారని, దానికంటే ఎవరు ఎక్కువ ఇస్తే వారికి కూలీ తెలుగు రైట్స్ ను అమ్మాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా లానే రీసెంట్ గా సూర్య నటిస్తున్న రెట్రో సినిమా తెలుగు హక్కులకు కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. చివరకు దాదాపు రూ. 9 కోట్లతో సితార నాగవంశీ ఆ సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు మరోసారి కూలీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాడు. లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సినిమా లియో తెలుగు హక్కులను కూడా వంశీనే సొంతం చేసుకుని తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కూలీ షూటింగ్ చెన్నై ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది. మార్చి నెలాఖరుకి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్న టీమ్, ఈ నెలలోనే టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.