నెక్ట్స్ స్టెప్ ఏంటో చెప్పిన కన్నడ హీరో దర్శన్
13 డిసెంబర్ 2024న అనారోగ్యానికి వైద్య చికిత్స అవసరాల రీత్యా కోర్టులో బెయిల్ మంజూరైంది.
అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ అగ్రహీరో దర్శన్ జైలు శిక్షను అనుభవించిన సంగతి తెలిసిందే. 13 డిసెంబర్ 2024న అనారోగ్యానికి వైద్య చికిత్స అవసరాల రీత్యా కోర్టులో బెయిల్ మంజూరైంది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ఆన్లైన్లో తన ఆరోగ్య సమస్యలను ప్రస్థావిస్తూ.. భవిష్యత్ ప్రాజెక్ట్ ల గురించి దర్శన్ తన నిర్ణయం ఏమిటో చెప్పారు.
తన అభిమానులను 'సెలబ్రిటీలు' అంటూ సంబోధిస్తూ.. ప్రతి ఒక్కరినీ కలిసి వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని దర్శన్ అన్నారు. కానీ నొప్పి, ఆరోగ్య సమస్యల కారణంగా నేను ప్రస్తుతం ఎక్కువసేపు నిలబడి ఉండలేనని తెలిపారు. ''కష్ట సమయాల్లోను మీ ప్రేమ నన్ను ముందుకు నడిపించింది. ఈ సంవత్సరం నేను మీ అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయినా ఎప్పటికీ కృతజ్ఞుడను. నేను మరింత బలంగా తిరిగి వస్తాను'' అని అతడు వ్యాఖ్యానించాడు. అంతేకాదు పెండింగ్ కమిట్మెంట్లను సకాలంలో పూర్తి చేయడానికి తన శస్త్రచికిత్సను వాయిదా వేస్తున్నానని వెల్లడించాడు. అంతేకాకుండా ఇంజెక్షన్లతో తన నొప్పిని అణచివేసుకుని పనిచేస్తానని పేర్కొన్నాడు.
అలాగే నిర్మాతకు తాను తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి వెనక్కి ఇచ్చానని కూడా దర్శన్ వెల్లడించాడు. తాను కన్నడ సినీపరిశ్రమ నుండి వైదొలగడం లేదని .. దర్శకుడు ప్రేమ్తో సినిమాని పూర్తి చేస్తానని తెలిపాడు. తాను ఇతర భాషలలో పనిచేస్తున్నట్లు వచ్చే పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులను కోరాడు. నేను ఎప్పటికీ కన్నడ సినిమాకి కట్టుబడి ఉన్నాను. నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానని దర్శన్ ఎమోషనల్ అయ్యాడు.
అభిమాని హత్య అనంతరం దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడ సహా ఇతరులపై జూన్ 2024లో కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియురాలు పవిత్ర గౌడపై అభిమాని రేణుకాస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, అది గొడవకు దారితీసి, చివరికి చిత్రహింసలకు గురి చేసి చంపారని పోలీసుల నివేదిక వెల్లడించింది.