కొడితే కుంభ స్థలాన్నే కొట్టేలా నయా మేకర్స్!
వంశీ పైడిపల్లి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కే స్టోరీ వినిపించారని..ఆయన కూడా పాజిటివ్ గా స్పందిం చినట్లు వార్తలొస్తున్నాయి.;

కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని కొందరు మొక్కవోని దీక్షతో ఉంటారు. అనుకున్న ఛాన్స్ వచ్చే వరకూ మరో ఛాన్స్ వచ్చినా తీసుకోరు. స్టార్ హీరోలే టార్గెట్ గా పనిచేయాలని ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లలో వంశీ పైడిపల్లి- హరీష్ శంకర్ ద్వయం కూడా ఉంది. రాంగోపాల్ వర్మ వద్ద శిష్యరికం అనంతరం హరీష్ శంకర్ కొత్త హీరో అనే మాట లేకుండా నేరుగా మాస్ రాజా రవితేజ్ తోనే షాక్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
దర్శకుడిగా హరీష్ తొలి సినిమా అదే. ఆ సినిమా ప్లాప్ అయినా మళ్లీ అదే హీరోతో 'మిరపకాయ్' చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. అటుపై నేరుగా పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' తెరెక్కించి హిట్ ఇచ్చాడు. హరీష్ హీరోల జాబితాలో చిన్న ఎవరైనా ఉన్నారు? అంటే అది సాయిధరమ్ తేజ్ ఒక్కడే. మిగతా నటులంతా స్టార్ హీరోలే. వంశీ పైడిపల్లి కూడా ఇదే వరుసలో ఉన్నాడు. తొలి సినిమా 'మున్నా' ప్రభాస్ తో తెరకెరక్కించాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, కార్తీ, నాగార్జున ,మహేష్, విజయ్ ఇలా స్టార్ హీరోలతోనే పని చేసాడు. ప్రస్తుతం ఈ నయా మేకర్స్ ఇద్దరు ఖాళీగానే ఉంటున్నారు. అలాగని టైర్ 2 హీరోలను మాత్రం టచ్ చేయలేదు. చేస్తే స్టార్ హీరోలతోనే అన్నట్లు కూర్చున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' తీస్తాడు. కానీ అందుకు సమయం పడుతుంది. మరి ఈలోపు ఏం చేయాలంటే? ఉంటే ఖాళీగా ఉండాలి.
లేదంటే ఇతర పరిశ్రమలవైపు వెళ్లాలి. ఇందులో వంశీ, హరీష్ ఇద్దరు రెండో ఆప్షన్ చూజ్ చేసుకున్నారు. అలాగని అక్కడా ఆ డైరెక్టర్లు ఇద్దరు తగ్గడం లేదు. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరోల్నే లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ కి స్టోరీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలొస్తున్నాయి.
వంశీ పైడిపల్లి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కే స్టోరీ వినిపించారని..ఆయన కూడా పాజిటివ్ గా స్పందిం చినట్లు వార్తలొస్తున్నాయి. ఇద్దరికి ఈ రెండు ప్రాజెక్ట్ లు ఒకే అయితే గనుక సీన్ మామూలుగా ఉండదు. ఇప్పటికే గోపీచంద్ మలినేని సన్ని డియోల్ తో 'జాట్' చిత్రాన్నితెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వాళ్ల సరసన ఈ కాంబినేషన్లు కూడా చేరుతాయి.