అమ్మ బర్త్‌ డే స్పెషల్‌ జాన్వీ..!

నేడు శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి లో శ్రీవారిని దర్శించుకుంది.

Update: 2024-08-13 11:32 GMT

అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు. ఆమె చనిపోయి అయిదు సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఆమె సినిమాలను చూసి ఆరాధించిన వారే అంతగా ఆమెను అభిమానిస్తే ఆమె పేగు పంచుకుని పుట్టిన పిల్లలు ఆమె పై ఎంతటి ప్రేమాభిమానాలను చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీదేవి ఇద్దరు కూతుర్లు కూడా తల్లి అంటే అమితమైన అభిమానం ను చూపించడం మనం చూస్తూనే ఉంటాం. నేడు శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి లో శ్రీవారిని దర్శించుకుంది.


మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జాన్వీ కపూర్‌ స్వామి వారి సేవలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జాన్వీ కపూర్ కి స్వాగతం పలికి దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అంతకు ముందు జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో తన ఫోటోలను షేర్‌ చేసింది. పసుపు రంగు పట్టు చీర ధరించి, ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించిన జాన్వీ కపూర్‌ మెడలో హారం ధరించి, నడుముకు వడ్డానం పెట్టుకుని తల్లి శ్రీదేవి ని గుర్తు చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో పాటు ఫోటోలను తెగ షేర్‌ చేశారు. ఐ లవ్ యూ అమ్మ అంటూ ఈ ఫోటోలతో పాటు జాన్వీ కామెంట్ చేసి తనకు అమ్మ పై ఉన్న ప్రేమను మరోసారి చూపించే ప్రయత్నం చేసింది.

ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ లో గత నాలుగు ఐదు సంవత్సరాలుగా వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అక్కడ కమర్షియల్‌ బ్రేక్ దక్కలేదు. ఒక్క హిట్‌ పడకున్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వార్తల్లో నిలవడం వల్ల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఒక పాత్ర కోసం ఎంతటి కష్టానికి అయినా జాన్వీ కపూర్‌ సిద్దపడుతుంది అనేందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల ఈమె ఒక సినిమా కోసం ఏకంగా నాలుగు నెలలు కష్టపడి క్రికెట్‌ ను నేర్చుకుందట.

తెలుగు లో ఈ అమ్మడి ఎంట్రీ కోసం సుదీర్ఘ కాలంగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జాన్వీ కపూర్‌ ఏకంగా ఎన్టీఆర్‌ కి జోడీగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా పై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. దేవర సినిమా విడుదల అవ్వక ముందే రామ్ చరణ్ కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గాను జాన్వీ కపూర్‌ కమిట్ అయ్యింది. ఇదే ఏడాదిలో ఆ సినిమా కూడా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలు హిట్‌ అయితే టాలీవుడ్‌ లో జాన్వీ మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News