ఎన్టీఆర్ ఆర్ట్స్ లో 'క్వాలిటీ' విమర్శలపై కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ ఏమో రిలీజ్కు ముందు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను మించిన వరల్డ్ క్రియేట్ చేస్తున్నామన్నాడు.;

నందమూరి కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థలో ‘దేవర’ సహా పలు హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని ఫెయిల్యూర్లు కూడా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ బేనర్లోనే జై లవకుశ, దేవర లాంటి పెద్ద సినిమాలు చేశాడు. ఐతే మామూలుగా హీరోల సొంత నిర్మాణ సంస్థలంటే ప్రొడక్షన్ విషయంలో రాజీ లేకుండా ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అభిమానులు కూడా ఆ బేనర్లలో వచ్చే సినిమాలను స్పెషల్గా చూస్తారు.
కానీ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ విషయంలో మాత్రం భిన్నం. ఆ సంస్థలో ప్రొడక్షన్ వాల్యూస్ సరిగా ఉండవని.. భారీతనం కనిపించదని.. గీచి గీచి ఖర్చు పెడతారని స్వయంగా నందమూరి అభిమానులే విమర్శిస్తూ ఉంటారు. ‘దేవర’ రిలీజైనపుడు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కళ్యాణ్ రామ్ ఏమో రిలీజ్కు ముందు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను మించిన వరల్డ్ క్రియేట్ చేస్తున్నామన్నాడు. తీరా చూస్తే అంత క్వాలిటీ కనిపించలేదు. స్వయంగా నందమూరి అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సహ నిర్మాత హరికృష్ణను తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శల గురించి కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను ఇలాంటి నెగెటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోనని అతను స్పష్టం చేశాడు. తన సంస్థ పేరు చెడేలా తాము ఎలా వ్యవహరిస్తామని అతను ప్రశ్నించాడు.
నిజంగా ‘దేవర’లో క్వాలిటీ తగ్గి ఉంటే తారక్ ఊరుకుంటాడా అన్నాడు. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడ్డామో తమకే తెలుసని.. ఎక్కువగా సముద్రం నేపథ్యంలో వాటర్ సీక్వెన్సులే ఉన్న సినిమా తీయడం అంత తేలిక కాదని.. ఇలాంటి విజువల్స్ తెలుగులో ముందెప్పుడైనా చూశామా అని కళ్యాణ్ రామ్ ప్రశ్నించాడు. జనాలకు ఏదో ఒకటి నెగెటివ్గా మాట్లాడ్డం ఆసక్తి అని.. కానీ తాను మాత్రం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని కోరుకుంటానని.. ఇలాంటి నెగెటివ్ కామెంట్లకు, ప్రశ్నలకు స్పందించడం కూడా తనకు ఇష్టముండదని ఈ నందమూరి హీరో స్పష్టం చేశాడు.