కార్తీ 29: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో భారీ ప్రాజెక్ట్

భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ పీరియాడికల్ డ్రామా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-09-16 05:05 GMT

తన విభిన్నమైన కథల ఎంపికతో, అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీ, ప్రస్తుతం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై మరో పెద్ద ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కార్తీకి 29వ చిత్రం అవ్వడం విశేషం. ఈ చిత్రానికి తమిజ్ దర్శకత్వం వహించనున్నారు, ఇది ఒక పీరియాడికల్ డ్రామా గా రూపొందనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

కార్తీ మరియు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కలయికలో ఇప్పటికే 'ఖాకీ', 'ఖైదీ', 'సుల్తాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కాంబినేషన్లో మరింత వైవిధ్యమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ పీరియాడికల్ డ్రామా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు తమిజ్ గతంలో తన ప్రథమ చిత్రమైన తానక్కరన్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రముఖ విమర్శకుల ప్రశంసలు పొందటమే కాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన తెచ్చుకుంది. దాంతో ఆయన ఈ భారీ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా ఎంపికయ్యారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో కలిసి కార్తీ మరో కొత్త యంగ్ డైరెక్టర్ తో ఈ ప్రాజెక్ట్ చేయబోతుండటం పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది.

కార్తీ 29వ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది, సినిమాను 2025 లో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారని మేకర్స్ ప్రకటించారు. పీరియాడికల్ కథాంశంతో, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కార్తీ కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ అవుతుందనే అంచనాలు పెట్టుకున్నారు.

ఇక మరోవైపు కార్తి నటించిన సత్యం సుందరం సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'సత్యం సుందరం'కి సంబంధించి టీజర్ ఇటీవల విడుదలైంది. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక వారి 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకుల్లో మంచి స్పందన రాబడుతూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Tags:    

Similar News