సూపర్‌ స్టార్‌ తో అనగానే షాక్ అయ్యా!

తాజాగా హీరోయిన్ మంజు వారియర్‌ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.

Update: 2024-09-25 12:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ 'వేట్టయాన్‌' సినిమాతో దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటి మంజు వారియర్‌ నటించింది. ఇటీవల రజినీకాంత్‌, మంజు వారియర్ కాంబోలో వచ్చిన మనసిలాయో పాట కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా ఆ పాటలో మంజు వారియర్ లుక్ కి, ఆమె వేసిన స్టెప్స్‌ కి మంచి స్పందన దక్కిన నేపథ్యంలో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా హీరోయిన్ మంజు వారియర్‌ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.

మంజు వారియర్ మాట్లాడుతూ... గత సంవత్సరం నేను తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ సినిమా కథను వినోద్‌ గారు నాకు చెప్పిన సమయంలో హీరో అజిత్ అనే విషయాన్ని చెప్పలేదు. కానీ ఆయనతో సినిమా అనగానే నేను సర్‌ప్రైజ్ అయ్యాను. ఆ సినిమాలో అజిత్ గారితో నటించడం చాలా సంతోషం కలిగించింది. ఆ సినిమా తనకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. జై భీమ్ సినిమా చూసిన సమయంలో చాలా సార్లు ఒక్కసారి అయినా జ్ఞానవేల్‌ సర్‌ దర్శకత్వంలో నటించాలని అనుకున్నాను. తక్కువ సమయంలోనే ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది.

వేట్టయాన్‌ సినిమా కథ ను నా వద్దకు జ్ఞానవేల్‌ సర్ తీసుకు వచ్చిన సమయంలో సర్‌ప్రైజ్ అయ్యాను. అదే సమయంలో ఆయన రజినీకాంత్‌ సర్ ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకునే అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశ పడుతున్న నాకు పెద్ద అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది. వేట్టయాన్‌ సినిమా లో తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. రజినీకాంత్ తో నటించిన ప్రతి సన్నివేశం చాలా స్పెషల్‌ గా తనకు నిలిచి పోతుందని అంది.

మనసిలాయో పాటకు ఈ స్థాయి స్పందన వస్తుందని మేము అనుకోలేదు. పాటలో సింపుల్‌ స్టెప్స్‌ తో పాటు, ఔట్ ఫిట్ ని బాగా డిజైన్ చేశారు. అందుకే ఆ పాటకు ఇంతటి క్రేజ్ దక్కింది. తప్పకుండా ప్రేక్షకులు అంతా సినిమాలో ఆ పాటను మరింతగా ఇష్టపడుతారు అంటూ ఆమె పేర్కొంది. నా కెరీర్ లో ఎన్నో పాటల్లో నటించాను. కానీ ఇంతటి హిట్, పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన పాట మాత్రం ఇదే అంటూ మంజు వారియర్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లుగా మంజు వారియర్‌ తెలియజేసింది. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News