'విశ్వంభర'తో మెగా ఫ్యాన్స్లో అసహనం...!
విశ్వంభర సినిమాతో చిరంజీవి కచ్చితంగా ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని మెగా ఫ్యాన్స్తో పాటు అంతా నమ్మకంగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంభర సినిమాను గత ఏడాది ప్రారంభించిన సమయంలో 2025 సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు. కానీ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమాను 2025 సమ్మర్లో విడుదల చేస్తామంటూ ప్రనకటించారు. కానీ ఇప్పటి వరకు విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మే నెలలో సినిమాను విడుదల చేయాలని భావించినా సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి అయిందనే వార్తలు వస్తున్నాయి.
షూటింగ్ పూర్తి చేసి వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ కిందా మీదా పడుతున్నారు. విశ్వంభర టీజర్ వీఎఫ్ఎక్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్ఎక్స్ టీంను ఈ సినిమా కోసం రంగంలోకి దించారట. బడ్జెట్ పెరగడంతో పాటు సమయం కూడా దాదాపు నాలుగు నుంచి ఆరు నెలలు అధికంగా పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో సినిమా మే నెలలో విడుదల కాకపోవచ్చు అంటున్నారు.
విశ్వంభర సినిమాతో చిరంజీవి కచ్చితంగా ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని మెగా ఫ్యాన్స్తో పాటు అంతా నమ్మకంగా ఉన్నారు. బింబిసార సినిమాను డీసెంట్ హిట్ చేసిన దర్శకుడు వశిష్ట ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన డేట్ను ప్రకటిస్తామని ఆ మధ్య నిర్మాతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్లో అసహనం మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.