నాగబాబు వెర్షన్ కూడా కరెక్టే కదా

అమ్మాయి ఆరోపణలు విని.. జానీది మాత్రమే తప్పు అని నిర్ణయించేసి అతణ్ని దోషిని చేసేయడం కరెక్టా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

Update: 2024-09-20 03:57 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. తన మీద పోక్సో చట్టం కింద కేసులు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే.. జానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ రోజు బెంగళూరులో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు. ఈ వివాదంలో తన వెర్షన్ ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎక్కువమంది జానీనే తప్పుబడుతున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న అంశాలు బయటికి రావడంతో జానీ ఇలాంటి వాడా అని అతణ్ణి అసహ్యించుకుంటున్నారు. ఐతే ఈ కేసులో అందరూ నాణేనికి ఒక వైపే చూస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అమ్మాయి ఆరోపణలు విని.. జానీది మాత్రమే తప్పు అని నిర్ణయించేసి అతణ్ని దోషిని చేసేయడం కరెక్టా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు ఒక కోట్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి మీద ఆరోపణలు రాగానే అతనే దోషి అని తీర్మానించడం కరెక్ట్ కాదని.. కోర్టులో తన నేరం రుజువై అతను దోషిగా తేలితేనే దోషి అనే నిర్ణయానికి రావాలని ఒక ప్రముఖ వ్యక్తి కోట్‌ను నాగబాబు ప్రస్తావించారు. అంతకుమించి ఈ పోస్టులో ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దీని మీద సోషల్ మీడియాలో భిన్న స్పందన వస్తోంది. కొందరేమో జానీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తే తనకు మద్దతుగా మాట్లాడతారా అని ఆయన మీద మండిపడుతున్నారు. జానీ జనసేనకు పని చేసిన నేపథ్యంలో నాగబాబు అతణ్ని వెనకేసుకు వస్తున్నాడని విమర్శిస్తున్నారు. అదే సమయంలో నాగబాబు వెర్షన్ కరెక్టే కదా.. నాణేనికి ఒకేవైపు చూసి అతణ్ని దోషిగా తీర్మానించడం ఎంత వరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News