వార్ 2: తారక్ స్థాయిని పెంచే యాక్షన్ ఘట్టం

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా మినిమమ్ హిట్టు కొడుతూ సత్తా చాటుతోన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Update: 2024-10-22 08:05 GMT

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా మినిమమ్ హిట్టు కొడుతూ సత్తా చాటుతోన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. అప్పుడెప్పుడో వచ్చిన ‘టెంపర్’ నుంచి ఇటీవల విడుదలైన ‘దేవర’ వరకూ ఏకధాటిగా మంచి విజయాలను అందుకున్న అతడు.. పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో పాటు తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ జోష్‌లోనే మరిన్ని సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు.

బీభత్సమైన ఫామ్‌తో దూసుకెళ్తోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్‌లో నేరుగా ‘వార్ 2’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన ‘వార్’ మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అయాన్ ముఖర్జీ రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి.

ఇండియాలోనే బడా స్టార్లుగా వెలుగొందుతోన్న ఇద్దరు హీరోలు కలిసి నటిస్తోన్న ‘వార్ 2’ మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టేశారు. హృతిక్ రోషన్ గతంలోనే ఈ సినిమా షూట్‌లో పాల్గొనగా.. ఎన్టీఆర్ ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు, మళ్లీ చిత్రీకరణ కోసం రెండు రోజుల క్రితమే ముంబై నగరానికి చేరుకున్నాడు.

‘వార్ 2’ సినిమాకు సంబంధించిన షూటింగ్ నేటి నుంచి అంధేరిలో స్టార్ట్ కానుంది. యశ్ రాజ్ స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో స్పెషల్ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌పై ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఈ ఫైట్ సీన్‌లో అతడు ఏకంగా 40 మందితో ఫైటింగ్ చేస్తున్నాడట. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో రూపొందుతోన్న ‘వార్ 2’ మూవీలో ఇప్పుడు జరుగుతున్న ఫైట్ సీన్ హైలైట్‌గా ఉండబోతుందట. ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను హై రేంజ్‌కు తీసుకు వెళ్లేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అయాన్ ముఖర్జీ స్పెషల్ గా ప్లాన్ చేశాడని అంటున్నారు. మొత్తానికి ‘వార్ 2’తో ఎన్టీఆర్ ఇండియన్ సూపర్ స్టార్‌గా మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం అనిపిస్తోంది.

ఇక, ఎన్టీఆర్ - హృతిక్ కాంబోలో రాబోతున్న ‘వార్ 2’ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఆలియా భట్, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Tags:    

Similar News