అడవి శేష్ ప్రపోజల్ తిరస్కరించిన పవన్?
పవన్ కళ్యాణ్, సాహో సుజీత్ కాంబో మూవీ 'ఓజీ' ప్రారంభించి మూడు ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు.;
పవన్ కళ్యాణ్, సాహో సుజీత్ కాంబో మూవీ 'ఓజీ' ప్రారంభించి మూడు ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. ఈ ఏడాదిలో సినిమా విడుదల చేయాలని సుజీత్ ఎంత ప్రయత్నించినా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన పరిపాలనతో పాటు, పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారు. అందుకే సినిమాలకు డేట్లు ఇవ్వడంలో విఫలం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించిన పవన్ ఓజీ, వీరమల్లు సినిమాల కోసం డేట్లు కేటాయించాడు.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కానీ ఓజీ సినిమా షూటింగ్ ఇంకా చాలానే ఉందనే వార్తలు వస్తున్నాయి. వీరమల్లు సినిమాను మార్చిలో తీసుకు రావాలని భావించినప్పటికీ సాధ్యం కాదని తెలిపోయింది. అందుకే మే 9న సినిమాను విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. మరో వైపు ఓజీ సినిమా ఈ ఏడాదిలో ఉండే అవకాశాలు లేవు అని కొందరు అంటున్నారు. ఇదే సమయంలో ఓజీ 2 గురించిన ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓజీ స్క్రిప్ట్ వర్క్ సమయంలో దర్శకుడు సుజీత్తో కలిసి హీరో అడవి శేష్ వర్క్ చేశాడు. స్టైలిష్ మాఫియా సినిమాలపై పట్టు ఉన్న అడవి శేష్ను ఓజీ స్క్రిప్ట్ వర్క్లో భాగం చేశారు.
స్క్రిప్ట్ వర్క్ సమయంలోనే ఓజీ సినిమాను రెండు పార్ట్లుగా తీయాలని అడవి శేష్ సూచించాడట. అంతే కాకుండా ఒక పాత్రను క్రియేట్ చేసి అకీరాను ఓజీతో పరిచయం చేయాలని అడవి శేష్ ఆలోచన చేశాడట. కానీ అందుకు పవన్ కళ్యాణ్ తిరస్కరించాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు పార్ట్లుగా సినిమాను చేయడం తనకు సాధ్యం కాదని పవన్ సింగిల్ పార్ట్గానే ముగించాలని సుజీత్కి సూచించాడట. అంతే కాకుండా అకీరా నందన్ను ఇప్పట్లో సినిమాలకు పరిచయం చేయాలని తాను భావించడం లేదని కూడా పవన్ అన్నాడట. దాంతో ఓజీ 2 క్యాన్సల్ అయింది, అకీరా ఎంట్రీ ఇప్పుడే లేదని క్లారిటీ వచ్చింది.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ను స్టైలిష్ మాఫియా డాన్ పాత్రలో చూడబోతున్నాం. సాహోను మించి ఓజీ అద్భుతంగా ఉంటుంది అని ప్రేక్షుకలు బలంగా నమ్ముతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ముఖ్యంగా దర్శకుడు సుజీత్ కోరుకుంటున్నాడు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఒకవేళ ఈ ఏడాది సాధ్యం కాకుంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.