మంత్రి హోదాలో తార‌క్ నోట ప‌వ‌న్ జీ!

ఇలా ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రి హోదాలో విషెస్ అందుకోవ‌డం ఇదే తొలిసారి.

Update: 2024-09-21 09:57 GMT

మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం ఓ న‌టుడు మాత్ర‌మే. ద‌ర్శ‌కులు చెప్పింది చేయ‌డం మాత్ర‌మే అత‌డి ప‌ని. షూటింగ్ కి వెళ్ల‌డం సాయంత్రం ముగించుకుని రావ‌డం. అటుపై ఇత‌ర ప‌నుల్లో బిజీ అవ్వ‌డం అత‌డి షెడ్యూల్. కానీ నేడు అత‌డు ఓ రాజ‌కీయ నాయ‌కుడు. ఓ పార్టీకి అధ్య‌క్షుడు. అన్నింటికి మించి కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి హోదా సాధించిన నాయ‌కుడు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అన్ని ర‌కాల గౌర‌వ మ‌ర్యాద‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భుత్వం త‌రుపున అందుకుంటున్నారు. దీంతో పాటు సినిమా ఇండ‌స్ట్రీ ప‌క్ష‌పాతిగా ప‌వ‌న్ పేరిప్పుడు మారుమ్రోగిపోతుంది. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాలుకు ఓ మంత్రిగా అన్ని ర‌కాలుగా తాను చేయాల్సింద‌ల్లా చేస్తున్నారు. ఆమ‌ధ్య రిలీజ్ అయిన 'క‌ల్కి 2898' టికెట్ల రేట్ల విష‌యంలో ఎంతో పెద్ద మ‌న‌సు చాటుకున్న సంగ‌తి తెలిసిందే.

టికెట్ ధ‌ర‌లు 1000 రూపాయ‌లైనా పెంచుకోవ‌చ్చ‌ని సూచించారు. ఈ విష‌యాన్ని ఆ చిత్ర నిర్మాత అశ్వీనిద‌త్ స్వ‌యంగా తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా తొలిసారి డీసీఎం హోదాలో ప‌వ‌న్ ద‌త్ నుంచి కృత‌జ్ఞ‌త‌లు అందుకున్నారు. ప‌వ‌న్ తీసుకున్న ఈ చొర‌వ చూసి ఇండ‌స్ట్రీ నుంచి మ‌రికొంత మంది హ‌ర్షం వ్య‌క్తం చేసారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. క‌ళ్యాణ్ రామ్ ల ద్వారా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు అందుకున్నారు. 'దేవ‌ర' టికెట్ రేట్లు..అద‌న‌పు షోలకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంతోనే ఇది సాధ్య‌మైంది.

ఇలా ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రి హోదాలో విషెస్ అందుకోవ‌డం ఇదే తొలిసారి. అందులోనూ ప్ర‌త్యేకంగా తార‌క్ నుంచి విషెస్ అందుకోవ‌డం ఎంతో స్పెష‌ల్ అని చెప్పాలి. ఇంత‌వ‌ర‌కూ వీరిద్ద‌రు ఎక్క‌డా క‌లిసి కుంది లేదు. ఏ సినిమా వేడుక‌ను క‌లిసి పంచుకుంది లేదు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య పెద్ద‌గా ప‌రిచ‌యం కూడా లేదు. కానీ నేటి ప‌వ‌న్ కున్న మంత్రి ప‌ద‌వితో తార‌క్ నోట కృత‌జ్ఞ‌త‌ల మాట వ‌చ్చింది.

Tags:    

Similar News