న్యాయం గెలిచింది..నిర్మాత‌కు మూడేళ్లు జైలు!

న‌టి మాల్యామ‌ల్హోత్రా పెళ్లికి నిరాక‌రించింద‌ని నిర్మాత యోగేష్ సింగ్ క‌త్తితో దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-08 18:45 GMT

న‌టి మాల్యామ‌ల్హోత్రా పెళ్లికి నిరాక‌రించింద‌ని నిర్మాత యోగేష్ సింగ్ క‌త్తితో దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని ఓ కేఫ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు మాల్వీ ఆరోపించింది. నాలుగేళ్ల‌గా ఈ వ్య‌వ‌హారం కోర్టులో ఉంది. తాజాగా దీనిపై కోర్టు తీర్పు చెప్పింది. మాల్వీ మ‌ల్హోత్రా అందించిన‌ ఆధారాల ప్ర‌కారం ఆమెపై దాడి చేసిన‌ట్లు కోర్టు విశ్వ‌సించి సంచ‌ల‌న తీర్పునిచ్చింది. యోగేష్ సింగ్ కి మూడేళ్లు క‌ఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఈ సంద‌ర్భంగా మాల్వీ మ‌ల్హోత్రా సంతోషం వ్య‌క్తం చేసింది. `గ‌త నాలుగేళ్ల‌గా పోరాటం చేస్తున్నాను. ఎన్నో ఒత్తిడిలు ఎదుర్కున్నాను. చాలా ఆటంకాలు ఎదుర‌య్యాయి. కానీ ఎట్ట‌కేల‌కు న్యాయం గెలిచింది. న‌వ‌రాత్రులు అనేవి న్యాయం, స‌త్యం తాలూకా విజ‌యానికి ప్ర‌తీక . జీవితంలో ఎప్పుడూ స‌రైన మార్గంలోఉంటే త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంది. నాకు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాడే శ‌క్తినిచ్చిన అమ్మ‌వారికి ధ‌న్య‌వాదాలు. నాపై దాడి జ‌రిగిన నాటి నుంచి భ‌యంతోనే బ్ర‌తుకుతున్నాను.

చాలా మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాను. శారీర‌క మ‌చ్చ‌ల‌కంటే మాన‌సిక మ‌చ్చ‌లే న‌న్ను ఎక్కువ‌గా బాధించాయి. ఆ దాడి జ‌రిగిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ న‌న్ను ఎవ‌రో వెంబ‌డిస్తున్న‌ట్లే అనిపించింది. నాలో నా తండ్రి నిరంత‌రం ధైర్యం నింపారు. ఆయ‌న మ‌ద్ద‌తు ఎలాంటి తెర‌పీ లేకుండానే కోలుకున్నాను` అని తెలిపింది. మాల్వీ మ‌ల్హోత్రా `తిర‌గ‌బ‌డ‌రా సామీ` చిత్రంలో రాజ్ త‌రుణ్ కి జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మాల్వీ రాజ్ త‌రుణ్ ప్రియురాలు అంటూ లావ‌ణ్య ఆరోపించింది.

ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య ..మాల్వీపై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. మాల్వీ కార‌ణంగా రాజ్ త‌రుణ్ త‌న‌ని వ‌దిలేసాడ‌ని అప్ప‌ట్లో ఆరోపించింది. రాజ్ త‌రుణ్ పై లావ‌ణ్య అత్యాచారం కేసు కూడా పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టు విచార‌ణ‌లో ఉంది.

Tags:    

Similar News