యువ హీరో వివాదాలను భలే క్యాష్ చేసుకుంటున్నారే!

ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న తరుణంలో.. రాజ్ తరుణ్ నటించిన పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.

Update: 2024-07-23 06:02 GMT

టాలీవుడ్ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ గత కొన్ని రోజులుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ తనను ప్రేమించి సహజీవనం చేసి మోసం చేశాడని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ చేస్తూ తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనని గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చాడని సంచలన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న తరుణంలో.. రాజ్ తరుణ్ నటించిన పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రం 'తిరగబడర సామీ'. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మన్నార్ చోప్రా కీలక పాత్ర పోషించింది. అప్పుడెప్పుడో కంప్లీట్ అయిన ఈ మూవీ.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 2న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రేయసినంటూ లావణ్య తెర మీదకి వచ్చింది. మీడియాలో సోషల్ మీడియాలో ఈ వివాదం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సమయంలోనే.. 'పురుషోత్తముడు' అనే మరో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పురుషోత్తముడు'. ఇందులో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి, ఈ శుక్రవారం జులై 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ లవ్‌ డ్రామా అని అర్థమవుతోంది. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, కస్తూరి, బ్రహ్మనందం, ముఖేష్‌ ఖన్నా లాంటి భారీ తారాగణం నటించారు.

ఇక రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా ‘భలే ఉన్నాడే’. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మనీషా హీరోయిన్ గా నటించింది. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ బయటకి వచ్చాయి. అయితే త్వరలోనే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. పెద్ద సినిమాల మధ్య గ్యాప్ చూసుకొని ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసే అవకాశం ఉంది.

ఇలా రాజ్ తరుణ్ నుంచి 'పురుషోత్తముడు','తిరగబడరసామీ', 'భలే ఉన్నాడే'వంటి మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అతని చుట్టూ వివాదాలు నెలకొన్న టైమ్ లోనే రిలీజ్ అవుతుండటం గమనార్హం. పరోక్షంగా ఈ కాంట్రవర్సీ సినిమాలకు ఎంతో కొంత ప్రచారం చేసి పెడుతోంది. అయితే రాజ్ తరుణ్ మాత్రం మూవీ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. 'పురుషోత్తముడు' ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముందుకొస్తాడని భావించారు కానీ, అతను ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడని తెలుస్తోంది.

Tags:    

Similar News