ఎట్టకేలకు టాలీవుడ్ లో అడుగుపెడుతున్న కన్నడ కస్తూరి!

ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ డెబ్యూ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-07 23:30 GMT

సౌత్ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'సప్త సాగరాలు దాటి' సినిమాలో తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ డెబ్యూ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు రుక్మిణి తెలుగు ఎంట్రీ ఫిక్స్ అయింది. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది.

నిఖిల్ సిద్దార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో''. 'స్వామి రారా' 'కేశవ' తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిపోయింది. దీనికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాతోనే రుక్మిణి వసంత్ తెలుగు చిత్ర సీమకు పరిచయం కాబోతోంది. ఆమెతో పాటుగా 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా కనిపించబోతోంది.

తాజాగా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసారు. దీనికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రుక్మిణి చాలా అందంగా కనిపించింది. ఆమెను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అనే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమా హిట్టయితే కచ్చితంగా అమ్మడికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని సినీ అభిమానులు భావిస్తున్నారు.

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా మూడేళ్ళ క్రితమే షూటింగ్ జరుపుకున్నట్లుగా వార్తలు ఉన్నాయి. దీని ప్రకారం 'సప్త సాగరాలు దాటి' కంటే ముందు, నిఖిల్ సినిమాతోనే రుక్మిణి వసంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సింది. కానీ ఎందుకనో అప్పుడెప్పుడో రావాల్సిన ఈ సినిమా ఆలస్యమై, ఇన్నాళ్లకు థియేటర్లలోకి వస్తోంది. మరి ఈ సినిమా రుక్మిణికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో, ఆమె తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ చేసిన రుక్మిణి వసంత్.. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 2019లో 'బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది 'అప్ స్టార్ట్స్' అనే హిందీ చిత్రంలో కనిపించింది. ఇక 2023లో రక్షిత్ శెట్టితో కలిసి నటించిన 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో వచ్చిన 'బాణదరియల్లి' చిత్రం ఆకట్టుకుంది. ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'' చిత్రం రాబోయే దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' తర్వాత రుక్మిణికి తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అలానే 'ఏస్' మూవీలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటుగా 'బఘీరా', 'భైరతి రణగల్' అనే రెండు కన్నడ చిత్రాల్లో రుక్మిణి వసంత్ నటిస్తోంది.

Tags:    

Similar News