దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత మనోజ్ కుమార్ ఇక లేరు
లెజెండరీ అనే పదానికి మీనింగ్ అతడు. తనదైన నటన ఆల్ రౌండర్ నైపుణ్యానికి గొప్ప గుర్తింపు పొందిన మేటి కళాకారుడు మనోజ్ కుమార్.;

లెజెండరీ అనే పదానికి మీనింగ్ అతడు. తనదైన నటన ఆల్ రౌండర్ నైపుణ్యానికి గొప్ప గుర్తింపు పొందిన మేటి కళాకారుడు మనోజ్ కుమార్. తాజాగా అందిన సమాచారం మేరకు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత మనోజ్ కుమార్ (87) ఇక లేరు. శుక్రవారం ఉదయం మనోజ్ కుమార్ మరణ వార్తను జాతీయ మీడియా ధృవీకరించింది. ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని కథనాలొస్తున్నాయి.
లెజెండరీ మనోజ్ కుమార్ దేశభక్తి సినిమాలతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. దేశభక్తి సినిమాల్లో నటించడమే గాక దర్శకత్వం వహించినందుకు ఖ్యాతి ఘడించారు. షాహీద్ (1965), ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), రోటీ కప్డా ఔర్ మకాన్ (1974) లాంటి చిత్రాల్లో మనోజ్ కుమార్ నటించారు. ఈ తరహా ఐడియల్ కథలను ఎంచుకున్న దర్శకనటుడిగా ఆయనను గౌరవిస్తూ `భరత్ కుమార్` అని కూడా పిలుపు అందుకున్నారు. హరియాలి ఔర్ రాస్తా, వో కౌన్ థి, హిమాలయ కీ గాడ్ మే, దో బదన్, పత్తర్ కే సనమ్, నీల్ కమల్, క్రాంతి సహా పలు విజయవంతమైన చిత్రాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ వరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
శనివారం అంత్యక్రియలు:
మనోజ్ కుమార్ కుమారుడు కునాల్ గోస్వామి కూడా తన తండ్రి మరణ వార్తను ధృవీకరించారు. అంతిమ సంస్కారాలు రేపు జరుగుతాయని కునాల్ వెల్లడించారు. ``నాన్నగారు చాలా కాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఈ ప్రపంచానికి ప్రశాంతంగా వీడ్కోలు పలికారు.. ఆయన అంత్యక్రియలు రేపు(శనివారం) జరుగుతాయి`` అని మనోజ్ కుమార్ కుమారుడు కునాల్ గోస్వామి వెల్లడించారు.
``దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, స్ఫూర్తి చిహ్నం.. భారత చలనచిత్ర పరిశ్రమకు `సింహం` అయిన మనోజ్ కుమార్ జీ ఇక లేరు... ఇది పరిశ్రమకు తీవ్ర నష్టం.. మొత్తం పరిశ్రమ ఆయనను మిస్సవుతోంది!`` అని ప్రముఖ ఫిలింమేకర్ అశోక్ పండిట్ తన ఆందోళనను వ్యక్తం చేసారు.