అర్జున్‌ రెడ్డి బ్యూటీకి ఎట్టకేలకు ఓ బిగ్ ఛాన్స్‌..!

టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లోనూ అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు ఎట్టకేలకు ఓ బిగ్ ఛాన్స్ ను దక్కించుకుంది.

Update: 2024-09-25 05:18 GMT

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా భారీ వసూళ్లు నమోదు చేయడంతో పాటు హీరో విజయ్ దేవరకొండ కి, హీరోయిన్‌ షాలిని పాండే కి మంచి గుర్తింపు ను తెచ్చి పెట్టింది. ఇద్దరి మధ్య రొమాన్స్‌, ముద్దు సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కదాని గురించి జరిగిన చర్చతో షాలిని పాండే గురించి చాలా వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌ లో ఆమె బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో షాలిని పాండే కు అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు.

టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లోనూ అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు ఎట్టకేలకు ఓ బిగ్ ఛాన్స్ ను దక్కించుకుంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించే అవకాశంను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో దక్కని గుర్తింపును కోలీవుడ్‌ లో ఈ అమ్మడు వెతుక్కుంటుంది. అందుకే ధనుష్ తో ఛాన్స్ వచ్చిన వెంటనే ఏమాత్రం వెనకాడకుండా ఓకే చెప్పింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా లో ఇప్పటికే నిత్యా మీనన్‌ హీరోయిన్‌ గా నటించబోతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్‌ గా షాలిని పాండేను ఎంపిక చేయడం జరిగిందట.

ధనుష్‌ బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ తో దూసుకు పోతున్నాడు. ఒక వైపు ఇతర దర్శకులతో కలిసి సినిమాలు చేస్తున్న ధనుష్ మరోవైపు సొంత దర్శకత్వం లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాయన్ సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన ధనుష్‌ తాజాగా 'ఇడ్లీ కడై' అనే చిత్రాన్ని ప్రకటించాడు. చిన్న బడ్జెట్‌ తో ధనుష్‌ చేయబోతున్న ఈ ప్రయోగాత్మక సినిమాలో నిత్యా మీనన్‌ హీరోయిన్‌ గా నటించబోతుంది. కీలక పాత్రకు గాను షాలిని పాండే ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. షాలిని పాండే కి ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభిస్తే తప్పకుండా ఆమె ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇడ్లీ కడై సినిమాను ధనుష్ దర్శకత్వంలో డాన్‌ పిక్చర్స్‌, వండార్బార్‌ ఫిలిమ్స్ బ్యానర్‌ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తి అయ్యాయి అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఈ సినిమాను ధనుష్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మరో వైపు ధనుష్ తన ప్రస్తుత సినిమాను శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్నాడు. కుబేరా టైటిల్‌ తో రూపొందుతున్న ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించడం విశేషం.

Tags:    

Similar News