సూపర్ ఛాన్స్ కొట్టేసిన శివానీ
స్టార్ హీరో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో ఫేమస్ సైంటిస్ట్, ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;

స్టార్ హీరో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో ఫేమస్ సైంటిస్ట్, ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
జూన్ నుంచి శివానీ రాజశేఖర్ జీడీ నాయుడు మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మాధవన్ తో కలిసి శివానీ స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. శివానీ గత సినిమాలను చూసిన దర్శకనిర్మాతలు ఈ పాత్రకు శివానీ అయితేనే న్యాయం చేస్తుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జీడీ నాయుడు బయోపిక్ లో శివానీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆమె కెరీర్లోనే ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన శివానీ తర్వాత 2 స్టేట్స్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన శివానీ ఇప్పుడు జీడీ నాయుడు బయోపిక్ లో మంచి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించనున్నారు.
ఇక గోపాలస్వామి దొరస్వామి నాయుడు కోయంబత్తూర్ లోని రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన పెద్దగా చదువుకోకపోయినా ప్రయోగాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో పలు రంగాల్లో తన సత్తా చాటి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఇండియాలో ఎలక్ట్రిక్ మోటర్ ను కనిపెట్టింది ఈయనే. హోటల్ సర్వర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో విప్లవాన్ని సృష్టించారు. సొంతంగా ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఆయన్ను మిరాకిల్ మ్యాన్, ఎడిసన్ ఆఫ్ ఇండియా, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్ అని పిలుచుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తుండగా అందులో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆల్రెడీ గతంలో రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమా ద్వారా నంబి నారాయణన్ జీవితాన్ని తెరకెక్కించి అందులో నటించి ఆ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న మాధవన్, ఇప్పుడు జీడీ నాయుడు బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి, యోగిబాబు, జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.