సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న సౌత్ ఫిలిం మేకర్స్!

ఎన్నో కోట్లు ఖర్చు చేసి, ఎంతో కష్టపడి సినిమా చేసినా.. దాని చుట్టూ కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు

Update: 2024-10-08 03:30 GMT

ఎన్నో కోట్లు ఖర్చు చేసి, ఎంతో కష్టపడి సినిమా చేసినా.. దాని చుట్టూ కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే మన ఫిలిం మేకర్స్ తమ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకూ.. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో చేరవేసి, తద్వారా సినిమాని జనాలకు చేరువ చెయ్యాలని భావిస్తుంటారు. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా షూటింగ్ స్టార్ట్ చేసి, తమ సినిమా మొదలైన విషయాన్ని అందరికీ తెలియజేస్తారు. మధ్య మధ్యలో షూటింగ్ అప్డేట్ ఇస్తూ తమ చిత్రం గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తారు. ట్రేడ్ లో చర్చలు జరిగేలా చేస్తారు.

అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఫిలిం మేకర్స్ సైలెంట్ గానే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా షూటింగ్ మొదలుపెట్టి, అదే విధంగా సినిమాని పూర్తి చేస్తున్నారు. చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయ్యే వరకూ ఎలాంటి సమాచారం బయిటకు ఇవ్వకుండా, ఉన్నట్టుండి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ చేస్తున్నారు. సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇస్తున్నారు.

తాజాగా నిఖిల్ సిద్దార్థ, రుక్మిణి వసంత్ జంటగా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే కొత్త చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టారో, ఎప్పుడు చిత్రీకరణ పూర్తి చేశారో తెలియదు కానీ.. మేకర్స్ సడన్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను వదిలారు. అంతేకాదు దీపావళికి థియేటర్లలోకి రాబోతోందని ప్రకటించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రెజెంట్ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నిఖిల్.. అసలు సుధీర్ వర్మ సినిమాని ఎప్పుడు పూర్తి చేశారో అని సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

'శాకుంతలం' సినిమాతో డిజాస్టర్ ఫలితాన్ని దర్శకుడు గుణశేఖర్.. చాలా కాలంగా బయట కనిపించకపోవడంతో సైలెంట్ అయిపోయారని అంతా భావించారు. కానీ సడన్ గా ఇప్పుడు 'యుఫోరియా' పేరుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళిందో తెలియదు కానీ, అప్పుడే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కొత్త వాళ్ళతో గుణ శేఖర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి కానీ, సగానికి పైగా చిత్రీకరణ కూడా పూర్తి చేస్తారని అనుకోలేదు.

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన 'మత్తు వదలరా 2' సినిమా సైతం చాలా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పే వరకూ అసలు ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ఉందని ఎవరికీ తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా నటించిన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. మొన్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే వరకూ ఈ మూవీ గురించి తెలియలేదు. 'మ్యాడ్ స్క్వేర్' మూవీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఎలాంటి సందడి లేకుండా షూట్ చేసిన చిత్ర యూనిట్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు' సినిమా సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది.

'కంగువ' చిత్రంతో రాబోతున్న తమిళ హీరో సూర్య.. విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో సినిమా చేస్తున్నారని బర్త్ డే గ్లింప్స్ రిలీజ్ అయ్యే వరకూ పెద్దగా తెలియలేదు. తాజాగా 'Suriya 44' మూవీ షూట్ అంతా ఫినిష్ అయినట్లుగా మేకర్స్ తెలిపారు. 120 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లుగా చెప్పారు. ఒక స్టార్ హీరోతో ఎలాంటి సందడి లేకుండా కేవలం నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదే విధంగా రజనీకాంత్ తో 'కూలీ' సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్.. సైలెంట్ గా అక్కినేని నాగార్జున, శృతి హాసన్ ల పోర్షన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. రజనీకి సంబందించి మేజర్ పార్ట్ షూట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇలా చాలామంది ఫిలిం మేకర్స్ చడీ చప్పుడు లేకుండా సినిమాలు చేస్తున్నారు.

Tags:    

Similar News