పండక్కి పంపలేదని ఆమె.. పండక్కి వెళ్లి తిరిగి రాలేదని అతడు సూసైడ్

ఒకే రోజు వెలుగు చూసిన ఈ రెండు విషాదాల్లోనూ జీవిత భాగస్వాముల నిర్ణయాలు కారణంగా ఉండటం గమనార్హం.

Update: 2024-10-17 11:30 GMT

రెండు వేర్వేరు సంఘటనలు. కాకుంటే ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మాత్రం జీవిత భాగస్వామి తీరే కావటం కామన్. దసరా పండక్కి తనను పుట్టింటికి పంపని భర్త తీరుతో వేదనకు చెందిన ఒక భార్య ఆత్మహత్య చేసుకున్న విషాదం చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. అదే సమయంలో పండక్కి పుట్టింటికి వెళ్లిన భార్య.. చిన్న మనస్పర్ధను మనసులో ఉంచుకొని పుట్టింటికి తిరిగిరాని వేదనతో మరో భర్త ఉరి వేసుకున్న విషాదం వికారాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఒకే రోజు వెలుగు చూసిన ఈ రెండు విషాదాల్లోనూ జీవిత భాగస్వాముల నిర్ణయాలు కారణంగా ఉండటం గమనార్హం.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన 22 ఏళ్ల సౌమ్యను నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్ తో పెళ్లి జరిగింది. వారికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పండక్కి పుట్టింటికి వెళతానని సౌమ్య అడిగినా.. భర్త ఒప్పుకోలేదు. దీంతో.. మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూ లేని వేళలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను గుర్తించిన భర్త హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రాథమికచికిత్స తర్వాత సిద్దిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లువైద్యులు వెల్లడించారు. పండక్కి.. అందునా పెద్ద పండుగైన దసరాకు భార్యను పుట్టింటికి పంపేందుకు ఒప్పుకోని వైనం ఒక ప్రాణం పోయేందుకు కారణమైంది.

మరో ఉదంతంలో పండక్కి పుట్టింటికి వెళ్లిన భార్య.. పిల్లలు తిరిగి రాకపోవటంతో వేదనకు గురైన ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ మండలం సిద్దులూరులో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్ల శ్రీకాంత్ కు.. రేణుకకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారికి నలుగురు సంతానం. కర్ణాటకకు చెందినవారు బతుకుదెరువు కోసం ఏడాది క్రితం సిద్దులూర్ శివారులోని ఒక ఫాంహౌస్ లో ఉంటున్నాడు. మేస్త్రిగా పని చేసే శ్రీకాంత్ తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. దసరా పండక్కి అందరూ సొంతూరుకువెళ్లారు. పండగ తర్వాత భర్తతో కలిసి వచ్చేందుకు భార్య ఒప్పుకోలేదు. మద్యం తాగే అలవాటు మార్చుకుంటేనే పుట్టింటి నుంచి వస్తానని కచ్చితంగా చెప్పింది.

దీంతో కోపంతో ఫామ్ హౌస కు వచ్చేసిన అతను.. భార్య.. పిల్లలు తనతో రాలేదన్న వేదనతో మద్యం తాగాడు. ఒంటరితనం భరించలేక ఆవేశానికి లోనై ఉరి వేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ రెండు ఉదంతాలు స్థానికంగా సంచలనంగా మారాయి.

Tags:    

Similar News