మద్యం డబ్బుతో సినిమాల నిర్మాణం?.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెట్టుబడులు?
లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ గా చెబుతున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడమే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతోందని అంటున్నారు.;

ఏపీ మద్యం స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పురోగతి సాధిస్తోంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి కోసం సిట్ పోలీసులు ముమ్మరంగా వేటాడుతున్నారు. విచారణకు రమ్మంటూ మూడుసార్లు నోటీసులిచ్చినా లెక్కచేయని రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. అతడిని తమకు లొంగిపోవాల్సిందిగా సూచిస్తున్న సిట్ అధికారులు.. రాజ్ కసిరెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు ఆయన ఇళ్లు, కార్యాలయాలు, సన్నిహితులు, స్నేహితుల నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించింది. సోమవారం హైదరాబాద్ చేరుకున్న 50 మంది ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు.
కసిరెడ్డి కింగ్ పిన్
లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ గా చెబుతున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడమే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతోందని అంటున్నారు. ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశంతో అడుగులు వేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఏఎస్పీ భూషణం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో సంపాదించిన డబ్బుతో రాజ్ కసిరెడ్డి సినిమాలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారని ప్రముఖ మీడియా లో కధనాలు వచ్చాయి. సినిమా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు బినామీ పేర్లతో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారని అంటున్నారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్న సమయంలో మద్యం స్కాంపై కేసులు నమోదయ్యాయని అంటున్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్స్ లోనూ వాటాలు పెట్టారని చెబుతున్నారు. కసిరెడ్డి కూతురు ఇషానీ పేరుతో ఓ ఇన్ఫ్రా సంస్థను నెలకొల్పారని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వాటాలు పెట్టారని, ఈ విధంగా బ్లాక్ మనీని చెలామణీకి తెచ్చారని పోలీసులు చెబుతున్నారు.
ఏ బ్రాండు అమ్మాలని డిసైడ్ చేసేది అతడే..
గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఎక్కువగా మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షించారని ఫిర్యాదులు ఉన్నాయి. హైదరాబాదు కేంద్రంగా మరో వైసీపీ నేతతో కలిసి ఆయన ఈ దందా నడిపినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ అమ్మాలనేది రాజ్ కసిరెడ్డి డిసైడ్ చేసేవారని, మందుబాబులు ఏం తాగాలో కూడా ఆయనే నిర్ణయించేవారని అంటున్నారు. అంతేకాకుండా తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డరులు జారీ చేసేవారని, ఇందుకోసం కేసుకు రూ.150 వసూలు చేసేవారని చెబుతున్నారు. ఇలా ఒక్కో నెల కనీసం రూ.60 కోట్లు కమీషన్లుగా దండుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ పాలనలో నాలుగేళ్ల 8 నెలల పాటు ఈ దందా కొనసాగిందని, మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా కూడేశారని రాజ్ కసిరెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికలు, టీవీ చానళ్లలో ఈ ఆరోపణలపై కథనాలు ప్రచారం అవుతున్నా, ఆయన ఇంతవరకు ఖండించకపోవడాన్ని సిట్ పరిగణలోకి తీసుకుంటోందని చెబుతున్నారు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు
ఇక మూడు నోటీసులను పట్టించుకోకపోవడంతో రాజ్ కసిరెడ్డి అరెస్టుకు సిట్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. తొలుత కసిరెడ్డికి చెందిన జూబ్లీహిల్స్, మంచిరేవుల్లోని ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంటికి రావడం లేదని, కొద్దిరోజుల క్రితం బయటకు వెళ్లినట్లు పనివారు చెప్పడంతో వారికి నోటీసులు అందజేసి, రాజ్ కసిరెడ్డి వచ్చాక అందజేయమని సూచించారు. ఆ తర్వాత కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి డైరెక్టరుగా ఉన్న రాయదుర్గం అరెట్ ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. కొన్ని పత్రాలు సేకరించారు. అక్కడి నుంచి ఆయన కుమార్తె పేరిట ఉన్న ఇషానీ ఇన్ ఫ్రా కార్యాలయం, ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డితోపాటు ఫైనాన్షియల్ డ్రిస్టిక్టులోని ఏక్తా ప్రైమ్ విల్లాసులోని విల్లాలోనూ సోదాలు నిర్వహించారు. నార్సింగిలోని రాజ్ పుష్పా ఓపెన్ స్కైస్ లోని నివాసంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. ఇదేసమయంలో రాజ్ కసిరెడ్డి అత్తమామలు పైరెడ్డి సుజాతారెడ్డి, శర్వారెడ్డి 5 రోజుల క్రితమే ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. మంచిరేవులలోని వారి ఇంటికి పోలీసులు వెళ్లగా, తాళాలు వేసి ఉంది. దీంతో అక్కడ ఆరా తీయగా వారు బయటకు వెళ్లినట్లు స్థానికులు సమాచారమిచ్చారు.
పోలీసు శాఖలో లీకు వీరులు
ఏపీ నుంచి తప్పించుకుని వస్తున్న మద్యం స్కాం నిందితులకు పోలీసుశాఖ నుంచి సహకారం అందుతున్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. తాము వెళ్లే చోటు విషయంలో ముందే సమాచారం లీకు అవుతుండటంతో నిందితులు పరార్ అవుతున్నట్లు సందేహిస్తున్నారు. కొందరు ఇంటి దొంగలే ఈ సమాచారం నిందితులకు చేరేలా సహకరిస్తున్నారని అంటున్నారు. దీంతో ఏపీలోని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ నిఘా వేసినట్లు చెబుతున్నారు.