పోలింగ్‌కు ఒక రోజు ముందు నిర్ణ‌యం.. ఇదేంటి చిన్న‌మ్మా?!

దీనికి సంబంధించిన ఎన్నిక‌లు ఈ నెల 27న అంటే.. మ‌రో ఒక్క రోజులోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యం లో తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

Update: 2025-02-25 09:32 GMT

కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంటున్న బీజేపీ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యాన్ని క‌లిగిస్తున్నాయి. విష‌యం ఏదైనా స్పందించే వ్య‌వ‌హారంలో మాత్రం చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని చెబుతున్నా.. అప్ప‌టికే చేతులు కాలిపోయాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా బీజేపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

దీనికి సంబంధించిన ఎన్నిక‌లు ఈ నెల 27న అంటే.. మ‌రో ఒక్క రోజులోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యం లో తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఓ ప్ర‌క‌ట‌న చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ లు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల‌ని ఆమె బీజేపీ ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు. వాస్త‌వానికి గ‌త నెల రోజుల నుంచి కూడా చంద్ర‌బాబు అలెర్ట్ అయినా.. బీజేపీ ప‌ట్టించుకోలేదు.

ఇక‌, ఇప్పుడు మాత్రం చిన్న‌మ్మ ముందుకు వ‌చ్చి.. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కోసం మండలిలో గళం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్..గత ప్రభుత్వం నిరిద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితి చూసామ‌ని.. పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పన కు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టభద్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించి తమ హక్కుల సాధన కు బాటలు వేసుకోవాలని సూచించారు.

ఇక‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ అభ్య‌ర్థి పేరాబ‌త్తుల రాజశేఖ‌ర్ విష‌యాన్ని ఆమె అస‌లు ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ర‌ఘువ‌ర్మ‌కు టీడీపీ మ‌ద్దతు ప్ర‌క‌టిస్తే.. అక్కడ బీజేపీ మ‌రో నాయకుడికి మ‌ద్ద‌తు ఇచ్చింది. ఈ ప‌రిణామాల‌పై చిన్నమ్మ స్పందించ‌లేదు. పైగా ఎన్నిక‌ల‌కు 24 గంట‌ల ముందు స్పందించ‌డం ఏంట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఏదేమైనా.. బీజేపీ వ్య‌వ‌హారం ఈ విష‌యంలో విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

Tags:    

Similar News