గంటకు 250 కిమీ వేగంతో గాలులొచ్చినా చెక్కుచెదరదు! ఈ రైల్వే బ్రిడ్జి గురించి తెలుసా?
జమ్మూ కాశ్మీర్ను అనుసంధానిస్తూ చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న జాతికి అంకితం చేయనున్నారు.;

జమ్మూ కాశ్మీర్ను అనుసంధానిస్తూ చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఇంజినీరింగ్ అద్భుతం పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా (369 మీటర్లు) ఉంది. ప్రారంభోత్సవం రోజునే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్లో భాగంగా 272 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో చివరిదైన కాట్రా-సంగల్దాన్ సెక్షన్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా న్యూఢిల్లీ-జమ్మూ కాశ్మీర్ మధ్య నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక రంగానికి, ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
43,780 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో 31 స్టేషన్లు, 36 టన్నెల్స్, 943 వంతెనలు ఉన్నాయి. ఈ వంతెన గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులను, భూకంపాలను కూడా తట్టుకోగలదు. రైల్వే మంత్రిత్వ శాఖ దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించింది. ప్రారంభోత్సవం రోజున శ్రీనగర్-కాట్రా, కాట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లు నడవనున్నాయి.