ఢిల్లీ లిక్కర్ కేసు ఇక సాధారణమే.. దాదాపు నిందితులందరికీ బెయిల్

తాజాగా సీఎం కేజ్రీకీ బెయిల్ లభించడంతో ఇక ఈ కేసులో ప్రముఖులెవరూ జైల్లో లేనట్లేనని చెప్పొచ్చు.

Update: 2024-09-14 01:30 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల నుంచి గోవా మీదుగా ఢిల్లీ వరకు మూలాలున్న కుంభకోణం ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు ఎందరినో జైలుపాల్జేసిన సంచలనాత్మక కేసు. అలాంటి కేసు ఇప్పుడు కీలక మలుపులు తీసుకుంటోంది. ఒకరి వెంట ఒకరు ప్రధాన నిందితుల నుంచి కేసులో సాధారణ నేపథ్యం ఉన్నవారు అందరూ బెయిల్ పై బయటకు వస్తున్నారు. తాజాగా సీఎం కేజ్రీకీ బెయిల్ లభించడంతో ఇక ఈ కేసులో ప్రముఖులెవరూ జైల్లో లేనట్లేనని చెప్పొచ్చు.

మనీశ్ సిసోదియా

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఈయన. మద్యం కేసులో 17 నెలలు జైల్లో ఉన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఈయన భార్య అనారోగ్యానికి గురయ్యారు. సిసోదియాకు ఇటీవల బెయిల్ వచ్చింది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు సీఎం కేజ్రీ కూడా బయటకు రావడంతో ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ బెయిల్ దొరికిందని చెప్పాలి. ఇక ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ ను 2022 మే నెలలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొట్టమొదటగా ఈడీ అరెస్ట్ చేసింది. ఈయనే అత్యంత సుదీర్ఘ కాలం జైల్లో ఉన్నారు. ఈయనకూ బెయిల్ దొరికింది.

కవిత.. 5 నెలల తర్వాత

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలకు పైగా బెయిల్ లో ఉన్నారు. ఈమె కూడా వేదనతో అస్వస్థతకు గురయ్యారు. ఎట్టకేలకు కొన్ని రోజుల కిందట కవిత బెయిల్ పై రావడం.. హైదరాబాద్ చేరుకోవడం జరిగిపోయింది. మనీ ల్యాండరింగ్ లో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆప్ వాలంటీర్ చన్ ప్రీత్ సింగ్, విజయ్ నాయర్, హైదరాబాద్ వ్యాపారి అరుణ్ పిళ్లై వీరందరికీ బెయిల్ వచ్చింది.

ఇదే కారణమా?

మద్యం కేసులో వరుసగా బెయిల్స్ రావడానికి.. నెలలు, ఏళ్ల పాటు జైల్లో ఉన్నవారు బయటకు రావడానికి ఈడీ, సీబీఐ విచారణ వైఫల్యమే కారణమనే అభిప్రాయం వినిపిస్మతోంది. నిందితులపై మోపిన అభియోగాలను కోర్టుల్లో రుజువు చేయడంలో ఈ సంస్థలు విఫలం అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. కేసులో ఆరోపణలకు.. దర్యాప్తు సంస్థలు చూపించిన ఆధారాలకు పొంతన లేకపోవడంతో.. నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నాయని అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం..?

Tags:    

Similar News