Begin typing your search above and press return to search.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలక్రిష్ణకు వ్యతిరేకంగా ఆందోళన?

టీడీపీ నేతల తీరును తప్పు పట్టిన రైతులు బాలక్రిష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 2:43 PM GMT
హిందూపురంలో ఎమ్మెల్యే బాలక్రిష్ణకు వ్యతిరేకంగా ఆందోళన?
X

హిందూపురంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతానికి భిన్నంగా తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేతల తీరును తప్పు పట్టిన రైతులు బాలక్రిష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇంతకూ అలాంటి పరిస్థితి హిందూపురంలో ఎందుకు చోటు చేసుకుంది?రైతుల ఆగ్రహానికి కారణం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. టీడీపీ నేతల కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని.. వారిని కంట్రోల్ చేసే విషయంలో బాలక్రిష్ణ రియాక్టు కావాటం లేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా హిందూపురం పోలీస్ స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన హాట్ టాపిక్ గా మారింది.

హిందూపురంలో రూ.2 కోట్ల విలువైన పాడి రైతుల భవనాన్ని ఇటీవల టీడీపీనేతలు కూల్చేశారు. ఈ తీరుపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా విలువైన భవనాన్ని కూల్చేస్తుంటే.. ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఎందుకు జోక్యం చేసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. పాడి రైతుల భవనాన్ని కూల్చేస్తున్న వైనంపై బాలయ్యను సంప్రదించే ప్రయత్నం చేసినా.. అందుబాటులోకి రాలేదని మండిపడుతున్నారు. దీనిపై బాలయ్య రియాక్టు కావాలని కోరుతున్నారు.

హిందూపురంలోని మొయిన్ బజార్ లో పేట వెంకటరమణస్వామి ఆలయం పక్కనున్న పాల రైతుల కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని రెండు రోజుల క్రితం కూల్చేశారు. 1938లో దాదాపు 177 మంది పాడి రైతులు కలిసి మూడు సెంట్లకు పైబడిన స్థలాన్ని కొనుగోలు చేసి సొసైటీ భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో దాదాపు వెయ్యి లీటర్ల పాలు సేకరించి అమ్మేశారు. ఐదేళ్ల క్రితం సొసైటీ భవన స్థలాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణ ఉంది. అయితే.. జగన్ ప్రభుత్వం కొలువు తీరటంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావటంతో టీడీపీ నేతలు కొందరు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగా అర్థరాత్రి వేళ భవనాన్ని జేసీబీలతో కూల్చేశారని చెబుతున్నారు. దీనిపై రైతులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే బాలక్రిష్ణ రియాక్టు కావాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.