దేశంలో ప్రమాద ఘంటికలు... బంగ్లా, పాక్ తర్వాత భారత్!
ఇటీవల కాలంలో.. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో.. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీలో గాలి పీలిస్తే... ఒక్క రోజులో 40 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చడంతో సమానం అనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య దేశాల జాబితా తెరపైకి వచ్చింది.
అవును... ఇటీవల ప్రాణాంతమైన పొగమంచు ఢిల్లీలోని ప్రతీ పౌరుడి ఊపిరితుత్తులకు హాని కలిగిస్తున్నాయనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించిందని తాజా నివేదికల్లో వెల్లడైంది! ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏక్యూఐ.ఇన్ ప్రకటించిన తాజా నివేదికలో.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో 140 ఏక్యూఐ తో బంగ్లాదేశ్ అత్యంత కాలుష్యం కలిగిన దేశంగా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 115 ఏక్యూఐతో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 111 ఏక్యూఐతో భారత్ మూడోస్థానంలో నిలిచింది.
ఇదే సమయంలో... అత్యంత కలుషిత నగరాల జాబితాలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏక్యూఐ 169 గా ఉండగా.. తర్వాత వరుసగా... గ్రేటర్ నొయిడా (166 ఏక్యూఐ), నోయిడా (161), ఘాజియాబాద్ (159), ఫరీదాబాద్ (154), గురుగ్రాం (153) నగరాలు అత్యంత కాలుష్యమైనవిగా గుర్తించబడ్డాయి.
ఈ సందర్భంగా.. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో నిరంతరం పెరుగుతున్న ఏక్యూఐకి కారణమయ్యే కారణాలను కూడా నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా.. వాహనాల నుంచి వెలువడే పొగతో పాటు పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల నుంచి వచ్చే కాలుష్యం వాటిలో ప్రధానమైనవని తెలిపింది.
ఇదే సమయంలో దేశంలో పరిశుభ్రమైన గాలి నాణ్యతను కలిగి ఉన్న నగరాల జాబితా కూడా తెరపైకి వచ్చింది. ఇందులో తిరునెల్వెలి (తమిళనాడు) 33 ఏక్యూఐతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా... తర్వాత స్థానాల్లో వరుసగా... నహర్లగున్ (అరుణాచల్ ప్రదేశ్) 43 ఏక్యూఐ, మడికెరి (కర్ణాటక) 44 ఏక్యూఐ, విజయపురి (కర్ణాటక) 47 ఏక్యూఐ, తంజాపూరు (తమిళనాడు) 47 ఏక్యూఐతో ఉన్నాయి.