యూఎస్ లో 12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. ఎవరీ ఇండియన్ టీచర్?
వివరాళ్లోకి వెళ్తే... అల్ఫారెట్టాలోని వెబ్ బ్రిడ్జి రోడ్డులోని కిడ్స్ ఆర్ కిడ్స్ లెర్నింగ్ అకాడమీలో పిల్లలపై దాడి చేసినట్లు తులసి పటేల్ పై ఆరోపణలు ఉన్నాయి.
By: Tupaki Desk | 15 Feb 2025 1:30 AM GMTఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. భారత సంతతికి చెందిన 22 ఏళ్ల ప్రీస్కూల్ టీచర్ తులసీ పటేల్ సుమారు ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత తాజాగా బాండ్ పై విడుదలయ్యారు. తులసీ పటేల్ కనీసం 12 మంది పిల్లలపై శారీరకంగా, లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... తులసీ పటేల్ తాజాగా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బాండ్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా... విచారణకు ముందు $3,000 తో పాటు 75,000 డాలర్ల బాండ్ ను దాఖలు చేసిన తర్వాత పటేల్ జనవరి 28న జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే.. పటేల్ బాండ్ పై విడుదలవ్వడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... అల్ఫారెట్టాలోని వెబ్ బ్రిడ్జి రోడ్డులోని కిడ్స్ ఆర్ కిడ్స్ లెర్నింగ్ అకాడమీలో పిల్లలపై దాడి చేసినట్లు తులసి పటేల్ పై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జూలైలో రెండు వారాల వ్యవధిలో ఈ రెండు ఘటనలు జరిగాయి. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పటేల్ మొత్తం 15 అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
ఇందులో మూడు తీవ్రమైన పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలు కాగా.. మరో ఐదు పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇదే సమయంలో.. పిల్లలపై క్రూరత్వం (ఫస్ట్ డిగ్రీ) తో పాటు తొమ్మిది సాధారణ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 17న ఫుల్టన్ కౌంటీ సుపరీయర్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆమె బాండ్ ను నిర్ణయించారు.
ఈ సందర్భంగా కొన్ని షరతులపై పటేల్ ను న్యాయమూర్తి విడుదల చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు ముగిసినప్పటికీ.. ఫుల్టన్ కౌంటీ జిల్లా అటర్నీ కార్యాలయం నిందితులపై అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తదుపరి విచారణ ఎప్పుడనేది ఇంకా షెడ్యూల్ కాలేదు. మరోపక్క.. ఈ కేసుకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నవారు 678-297-6300 నంబర్ లో ఆల్ఫారెట్టా పోలీసులను సంప్రదించాలని ఆధికారులు కోరారు.