ఆ పోలీస్ ఆఫీసర్లపై బాలీవుడ్ నటి కాదంబరి కంప్లైంట్!

తనపై తప్పుడు కేసులు పెట్టి.. శారీరకంగా.. మానసికంగ హింసకు గురి చేసిన ఉదంతంలో తాజాగా ఆమె పోలీసు ఉన్నతాధికారులపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారు.

Update: 2024-09-06 05:01 GMT

సంచలనంగా మారిన బాలీవుడ్ నటి కాదంబరి వ్యవహారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అనంతరం చోటు చేసుకున్న వరద ముంపు కారణంగా పక్కకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే విజయవాడ వరద షాక్ నుంచి బయటకు వస్తోంది. ఇలాంటి వేళ గురువారం రాత్రి విజయవాడలోని పోలీస్ కమిషరేట్ కార్యాలాయానికి వచ్చారు కాదంబరి. తనపై తప్పుడు కేసులు పెట్టి.. శారీరకంగా.. మానసికంగ హింసకు గురి చేసిన ఉదంతంలో తాజాగా ఆమె పోలీసు ఉన్నతాధికారులపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారు.

అప్పటి సీపీ.. డీసీపీ ... నిఘా విభాగాధిపతి ..లాంటి  కీలక అధికారులపై తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఏసీపీ స్రవంతి రాయ్ ను ఆమె కలిశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు కంప్లైంట్ ఆధారంగాతనపై అన్యాయంగా కేసు పెట్టి.. తనను తన పేరెంట్స్ ను ముంబయి నుంచి తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు.

ఫోర్జరీ పత్రాన్ని క్రియేట్ చేసి తప్పుడు కేసును నమోదు చేశారన్నారు. ముంబయిలో పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం స్టేషన్ లో కేసు పెట్టినట్లుగా పేర్కొన్న ఆమె.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబయి వచ్చి.. నన్ను నా తల్లిదండ్రుల్నిఅరరెస్టు చేశారు. ఇదంతా కుట్రంలో భాగమే. పోలీస్ కస్టడీలోని తీసుకున్న నన్ను ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. ముంబయి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. విద్యాసాగర్ ను అరెస్టు చేయాలి. నన్ను.. నాకుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలి’’ అని పేర్కొన్నారు.

17 క్రిమినల్ కేసులు ఉన్న కుక్కల విద్యాసాగర్ కు వైసీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించిన కాదంబరి.. అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయటంలో అర్థం లేదన్నారు. తన వ్యవహారానికి రాజకీయ రంగు పులమటం సరికాదన్న ఆమె.. తనను అరెస్టు చేసిన సమయంలో 10 ఎలక్ట్రానిక్ పరికరాల్ని పోలీసులు సీజ్ చేశారని.. వాటిని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదన్నారు. మొత్తానికి వరద ముంపు అంశం ఇప్పుడిప్పుడే తగ్గుతున్న వేళ.. మళ్లీ కాదంబరి వ్యవహారం తెర మీదకు రావటం గమనార్హం.

Tags:    

Similar News