అమరావతి.. అయోధ్య.. శివాజీ విగ్రహం.. మోదీ హస్తవాసి సరిగా లేదా?

వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగి.. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మళ్లీ గెలవడం చాలా కష్టం.

Update: 2024-08-31 14:30 GMT

వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగి.. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మళ్లీ గెలవడం చాలా కష్టం. దీనిని సాధ్యం చేశారు నరేంద్ర మోదీ. అయితే, గత రెండుసార్ల కంటే మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించలేకపోయారు. ఇప్పుడిక నాలుగో సారి కూడా తమదే అధికారం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మోదీ ‘హస్త’వాసి తగ్గిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. వాస్తవానికి మూడో విడతలో 400 పైగా సీట్లు సొంతంగానే సాధిస్తామని చెప్పుకొంది బీజేపీ. కానీ, 300 కూడా దాటలేకపోయింది. ఇప్పుడిక ఆయన గత రెండు విడతల్లో చేసిన పనులపై చర్చ మొదలైంది.

అయ్యో అమరావతి..

ప్రధాని మోదీ చేతుల మీదుగా 2015లో మొదలైంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అసలే రాజధాని భాగ్యం లేని ఆంధ్రులు. మద్రాసు నుంచి వెళ్లిపోవాల్సి వచ్చి, కర్నూలును వదిలేసి, హైదరాబాద్ ను ఖాళీ చేయాల్సిన పరిస్థితుల్లో అమరావతి వారి శాశ్వత రాజధానిగా ఆశాకిరణంలా కనిపించింది. కానీ, 2015-19 మధ్య అమరావతి ఓ కొలిక్కిరాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల పాటతో అమరావతి పూర్తిగా వెనక్కుపోయింది. ఇప్పుడు మూడో విడత మోదీ సర్కారులో, రెండో విడత (విభజిత) చంద్రబాబు పాలనలో అమరావతి భవితవ్యం ఏమిటో చూడాలి.


అయ్యో అయోధ్య..

శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం నిర్మాణం గత జనవరిలో నెరవేరింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన ప్రారంభోత్సవాన్ని పూర్తిగా మోదీ ‘చేతుల’ మీదుగానే నిర్వహించారు. బాల రాముడికి ఆయనే వస్త్రాలు తీసుకెళ్లారు. కానీ.. అయోధ్యలో భారీ వర్షాలతో గర్భగుడిలోకి నీరు చేరింది. అత్యంత ఘనంగా, అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన మందిర పై కప్పునకు ఆరు నెలలకే చిల్లు పడడం విమర్శలకు తావిచ్చింది. ఆలయ పరిసరాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదనే ఆరోపణలు ఉన్నాయి.


శివాజీ మన్నించు

అమరావతి, అయోధ్య తర్వాత ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలింది. ఇది కూడా మోదీ చేతుల మీదుగా ప్రారంభించినదే కావడం గమనార్హం. అసలే శివాజీ మహారాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక. అందులోనూ అక్కడ రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో మోదీ జరగబోయే నష్టాన్ని ఊహించారు. శిరస్సు వంచి క్షమాపణలు కోరారు. కాగా, మోదీ ప్రారంభించిన ఢిల్లీ విమానాశ్రయం పై కప్పు జూన్ నెలలో కుప్పకూలింది. ఒక ట్యాక్సీ డ్రైవర్ చనిపోయారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రాజ్ కోట్ శివారులో మోదీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. సంవత్సరం లోపే, టెర్మినల్ ప్యాసింజర్ డ్రాప్- పికప్ ఏరియాలోని భవనం పందిరిలో కొంత భాగం కూలిపోయింది.



Tags:    

Similar News