తిరుమలలో ఇవేం పనులు?... డి మాధురికి కొత్త సమస్యలు!!

అవును... పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి తోపాటు ఆలయం దగ్గర ఫోటో షూట్ చేసినట్లు దివ్వెల మాధురిపై పలు ఫిర్యాదులు అందాయని అంటున్నారు.

Update: 2024-10-11 04:29 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా నిలిచిన దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ వ్యవహారం ఓ కన్ క్లూజన్ కు వస్తున్నట్లు చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి బలమైన కారణం... దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో ఇచ్చిన పలు క్లారిటీలు! క్లారిటీ వరకూ సరే కానీ.. అక్కడ చేసిన కొన్ని పనులు సమస్యలు తెచ్చాయని అంటున్నారు!

దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా తిరుమల కొండపై వారిరువురూ పలు ఫోటోలు దిగారు. ప్రీవెడ్డింగ్ షూట్ కూడా జరిగిందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలొ ఆమె రీల్స్ చేశారనే విషయం ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పాడేసింది.

అవును... పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి తోపాటు ఆలయం దగ్గర ఫోటో షూట్ చేసినట్లు దివ్వెల మాధురిపై పలు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. ఇదే సమయంలో.. ఫోటో షూట్ తో పాటు రీల్స్ చేయడం పైనా విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. దీంతో... పోలీసులు దివ్వెల మాధురిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇందులో భాగంగా... శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరించారంటూ డి మాధురిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 292, 296, 300, సెక్షన్ 66 (ఈ) ఏటీ యాక్ట్ 2000-2008 కింద కేసు నమోదు చేశారు! ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది!

కాగా... దువ్వాడ శ్రీనివస్ - దివ్వెల మధురి గత సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి ఫోటో షూట్ కొనసాగిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో వారు పెళ్లిపై కూడా సంచలన ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా... కోర్టు కేసులు అన్నీ ముగిసిన తర్వాత త్వరలోనే అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటివరకూ ఇద్దరమూ కలిసె ఉంటామని మాధురి తెలిపారు.



Tags:    

Similar News