చంద్రబాబుకు ఎదురులేదు.. అమరావతికి తిరుగులేదు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉగాది పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా ఉగాది ఆస్థానాన్ని ఏర్పాటు చేశారు.;

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉగాది పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా ఉగాది ఆస్థానాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ పంచాగకర్త మాడుగుల నాగఫణిశర్మ భవిష్యవాణిని వినిపించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదని, అమరావతిని ఏపీకి రాజధాని ఎంపిక చేసిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుగులేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండుసార్లు నిరాటంకంగా కొనసాగుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబును నమ్ముకున్న వారందరికీ న్యాయం జరుగుతుందని, పదవులు దక్కని వారందరికీ మంచి పదవులు వస్తామయని చెప్పారు.
ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాంగ కర్త నాగఫణిశర్మ రాజధాని అమరావతిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆగుతూ, సాగుతూ ఉన్న అమరావతి నిర్మాణ పనులు ఇక వాయువేగం అందుకుంటాయని జోస్యం చెప్పారు. నిర్ణీత కాలంలోనే రాజధాని అమరావతి పూర్తవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అద్భుతమైన విశ్వనగరం నిర్మితమవుతుందని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు భవిష్యత్తు గురించి ప్రస్తావించిన శర్మ మరో పది, పదిహేనేళ్ల వరకు ఆయన అధికారానికి ఢోకా లేదని తెలిపారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదు, ఆరోసారీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని ఆయన సెలవిచ్చారు. వెరసి మరో పదిహేనేళ్ల దాకా చంద్రబాబు అధికారంలోనే కొనసాగుతారని ఆయన తెలిపారు. ఇక టీడీపీ నేతలు, కూటమి పార్టీల నేతల విషయాన్ని ప్రస్తావించిన శర్మ పదవులు రాలేదని బాధ పడాల్సిన అవసరం లేదని నేతలకు సూచించారు. అర్హత ఉన్న నేతలకు కాస్తంత ఆలస్యమైనా వారి అర్హతల మేరకు పదవులు దక్కుతాయని తెలిపారు. చంద్రబాబు చేతుల ద్వారానే ఆయా పదవులు నేతలకు అందుతాయని శర్మ తెలిపారు.