పవన్‌ కళ్యాణ్‌ పై రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు వైరల్‌!

మరోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయని బాంబుపేల్చారు.

Update: 2024-09-28 11:23 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి అంటున్నారు.

మరోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయని బాంబుపేల్చారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీయడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు శ్రీవారి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జంతువుల కొవ్వులు కలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో దోషులు ఎంత పెద్దవారు ఉన్నా వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవారికి మత రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు.

గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సహా అన్ని పార్టీల నాయకులు, మీడియా మొత్తం తిరుమల లడ్డూ సమస్య చుట్టూనే తిరుగుతున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరారు. మాజీ సీఎం జగన్‌... వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తే తిరుమల అపవిత్రమవుతుందంటూ కొందరు అధికార పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించడం సరికాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లూ సీఎంగా ఉన్న జగన్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాధారణ భక్తుడిలా తిరుమలకు వెళ్తానంటున్న జగన్‌ ను డిక్లరేషన్‌ అడగడం సరైన విధానం కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భార్య క్రిస్టియన్‌ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నారు? అని రామకృష్ణ నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పవన్‌ డిప్యూటీ సీఎం అయ్యింది లడ్డూపై దీక్షలు చేయడానికా అని మండిపడ్డారు.

అవసరమైతే లడ్డూ వ్యవహారంపై సీఎం, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని పవన్‌ కల్యాణ్‌ కు ఏం సంబంధమని రామకృష్ణ నిలదీశారు. లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సిట్‌ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మతం, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలను వీడాలి అని సూచించారు.

Tags:    

Similar News